సోనియా దయతోనే కేసీఆర్‌కు పదవి :నగ్మా

5 Dec, 2018 09:12 IST|Sakshi
అభివాదం తెలుపుతున్న ఏఐసీసీ కార్యదర్శి నగ్మా 

సాక్షి, వరంగల్‌: తెలంగాణ ఏర్పాటుతో సామాన్య నాయకుడిగా ఉన్న కేసీఆర్‌ సోనియాగాంధీ దయ వల్లనే సీఎం అయ్యారని ఏఐసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రజాకూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు వరంగల్‌కు వచ్చిన నగ్మా పోచమ్మమైదాన్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. గత ఎన్నికల్లో హామీలు ఇచ్చి అమలు చేయకుండా విస్మరించిన ప్రభుత్వానికి ఎలా ఓట్లు వేస్తారని ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా ఇచ్చిందన్నారు. వరంగల్‌ జిల్లా చైతన్యం వంతమైందని, ఇక్కడ ప్రజలు మోసాన్ని తట్టుకోలేరన్నారు. ఇచ్చిన వాగ్ధానాలను మర్చిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు తప్పకుండా బుద్ది చెబుతారని అన్నారు. ఈ ఎన్నికలు ప్రజల కోసమే వచ్చాయన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ ఫాంహౌస్‌లో ఉండి పాలిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వందల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారిని పరమార్శంచిన పాపానా టీఆర్‌ఎస్‌ నేతలు పోలేదన్నారు. రాష్ట్రం ఇచ్చిన సోనియా రుణం తీర్చుకునేందుకు ప్రజా కూటమిని గెలిపించి దేశంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. దేశాయిపేట కాలేజీలో చదువుకున్న తాను పక్కా లోకల్‌ అని వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధి ఎంటో చూపిస్తానన్నారు. కేసీఆర్‌ రెండు పదవులు ఉన్న వ్యక్తికి మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వద్దిరాజు రవిచంద్ర సతీమణి విజయలక్ష్మీ, తోట వేణుమాధవ్, ఆయూబ్‌ఖాన్, కట్ల శ్రీనివాస్, మోతిలాల్‌నాయక్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు