‘పాకిస్తాన్‌ దాడిని వాడుకొని మోదీ గెలిచారు’

25 Jul, 2019 13:12 IST|Sakshi

నాయిని నర్సింహారెడ్డి

సాక్షి, రామగుండం(కరీంనగర్‌) : ‘పాకిస్తాన్‌ దాడిని వాడుకొని మోదీ గెలిచాడు. కేంద్రంలో బీజేపీకి భారీ మెజార్టీ రావడం దురదృష్టకరం’ అని రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రావడంతో రైల్వే, ఎన్టీపీసీ పూర్తిగా ప్రయివేటుపరం అయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్‌డీఏ ప్రభుత్వం పబ్లిక్‌ ప్రయివేట్‌ పార్టనర్‌షిప్‌(పీపీపీ) విధానాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కానుండడంతో కార్మిక రంగం మేల్కొనాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరిఖని విప్లవాలకు పురిటిగడ్డని, తాను సింగరేణి కార్మిక సంఘాల్లో 30 ఏళ్లు పనిచేశానని, సమీపంలోని కేశోరాం కర్మాగారంలో కూడా ఐదేళ్లు ఏకగ్రీవంగా తనను కార్మిక సంఘం నాయకుడిగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. దేశంలోనే రైల్వే వ్యవస్థ అతిపెద్ద కీలకమైన ట్రాన్స్‌పోర్టేషన్‌ వ్యవస్థ అని దీనిని ప్రైవేటీకరిస్తే సామాన్యుడికి రైలు ప్రయాణం ఖరీదవుతుందని అన్నారు.  

>
మరిన్ని వార్తలు