టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ కిడ్నాప్‌

10 Jul, 2019 12:22 IST|Sakshi

చర్ల మండలంలో అపహరించిన మావోయిస్టులు 

చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్త కొత్తూరులో టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... శ్రీనివారావు ఇంటికి సోమవారం రాత్రి 10 గంటల సమయంలో సుమారు 30 మంది మావోయిస్టులు వచ్చారు. ఇంటి తలుపులు తెరిచే ఉండటంతో నేరుగా బెడ్‌రూంలోకి వెళ్లి నిద్రిస్తున్న శ్రీనివాసరావును లేపారు. బలవంతంగా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా భార్య దుర్గ, కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ అడ్డుపడ్డారు. దీంతో దుర్గకు ఒక మావోయిస్టు తుపాకీ చూపించి బెదిరించాడు. ప్రవీణ్‌ను కూడా పక్కకు నెడుతుండగా అతడికి మావోయిస్టులకు మధ్య పెనుగులాట జరిగింది. తమకు అడ్డు తగులుతున్నాడనే నెపంతో మరో మావోయిస్టు ప్రవీణ్‌కుమార్‌ తలపై కర్రతో బలంగా కొట్టడంతో తల పగిలింది. మరో మావోయిస్టు వచ్చి తుపాకీ చూపించి దుర్గ, ప్రవీణ్‌కుమార్‌ను అడ్డగించి శ్రీనివాసరావును బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.

మావోయిస్టులు ఒక ద్విచక్రవాహనాన్ని వెంట తెచ్చుకోగా.. వెళ్లే సందర్భంలో ఇంటి బయట ఉన్న శ్రీనివాసరావు ద్విచక్ర వాహనాన్ని కూడా తీసుకెళ్లారు. మావోయిస్టులు తీసుకొచ్చిన ద్విచక్రవాహనంపై ఎక్కించే క్రమంలో నిరాకరించిన శ్రీనివాసరావును అక్కడ కూడా కర్రలతో కొట్టినట్లు తెలిసింది. అక్కడి నుంచి కిష్టారంపాడు మీదుగా దండకారణ్యానికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. శ్రీనివాసరావు ఇంటికి వచ్చిన 30 మంది మావోయిస్టుల్లో 10 మంది వద్ద తుపాకులు, మిగిలిన వారి వద్ద విల్లంబులు, కర్రలు, కత్తులు, గొడ్డళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు