ఎన్పీడీసీఎల్ స్టోర్స్‌లో చోరీపై విచారణ

22 Aug, 2014 03:05 IST|Sakshi
  •  ఎట్టకేలకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు
  • హన్మకొండ సిటీ : ఎన్పీడీసీఎల్ జిల్లా స్టోర్స్‌లో జరిగిన చోరీపై అధికారులు విచారణ ప్రారంభించారు. హన్మకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ సహాయ డివిజనల్ ఇంజనీర్ జిల్లా  స్టోర్స్‌లో జిల్లాకు అవసరమయ్యే విద్యుత్ పరికరాలు నిలువ చేస్తారు.

    జిల్లాలో ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్లు అవసరమున్నా, లేక ఇతర మెటీరియల్ అవసరమున్నా ఈ స్టోర్స్ నుంచి పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ రిపేరింగ్ సెంటర్‌ల నుంచి వచ్చే కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ల కాపర్ వైర్‌ను ఇక్కడే నిలువ చేస్తారు. అరుుతే, ఆరు రోజుల క్రితం ఓ ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ సెంటర్ నుంచి కాపర్‌వైర్‌ను జిల్లా స్టోర్స్‌లో నిలువ చేయడానికి తీసుకొచ్చారు.

    ఈ క్రమంలో కాపర్‌వైర్ నిలువ చేసే గదికి ఉన్న తలుపు నుంచి వెలుతురు రావడాన్ని స్టోర్స్ అధికారులు గుర్తించారు. దగ్గరికి వెళ్లి చూడగా తలుపునకు రద్రం చేసి ఉంది. ఈ దర్వాజ వినియోగంలో లేదు. పైగా దర్వాజకు లోపలి వైపు గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. ఈ గదికి భద్రత ఉన్నప్పటికీ దొడ్డిదారిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. నిలువ చేసిన కాపర్ వైర్‌లో 17 క్లింటాళ్ళ వైరు చోరీకి గురైనట్టు అధికారులు గుర్తించారు. వెంటనే సుబేదారి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు.
     
    రూ.7 లక్షలు విలువ ఉండడంతో ఇది పెద్ద దొంగతనంగా భావించిన పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు వెనకడుగు వేశారు. నాలుగు రోజులుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తమను పట్టించుకోలేదని విద్యుత్ అధికారులు తెలిపారు. చోరీ జరిగిన విషయంపై గురువారం ‘సాక్షి’లో వార్త ప్రచురితం కావడంతో పాటు జిల్లా స్టోర్స్ బాధ్యలైన అధికారులు అడిషనల్ ఎస్పీని కలిసి పరిస్థితిని వివరించారు.

    ఆ తరువాత అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు ఫిర్యాదు స్వీకరించినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. డీఈలు విజేందర్‌రెడ్డి, ఉత్తం, విజిలెన్స్ సీఐ జితేందర్‌రెడ్డి జిల్లా స్టోర్స్‌కు వచ్చి దొంగతనం జరిగిన గదిని, చుట్టూ పరిసరాలు పరిశీలించారు. రాత్రి కాపలాదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా స్టోర్ట్స్‌ను ఆనుకొని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ గృహ సముదాయం ఉంది. ఈ గృహ సముదాయం, జిల్లా స్టోర్స్ మధ్యన ప్రహరీ ఉంది.

    ఇక్కడి నుంచి కాపర్ వైర్ బయటకి వెళ్లి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. నీటిపారుదల శాఖ ఎస్‌ఈ గృహ సముదాయం ఎప్పుడూ నిర్మాణుష్యంగా ఉంటుందని, దీంతో దీనిని చోరీకి అనువుగా చేసుకొన్నట్లుగా భావిస్తున్నారు. దీంతో పాటు ఇందులో పనిచేసే ఓ ఉద్యోగిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉద్యోగి కొన్ని రోజులుగా విధులకు హాజరు కాకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతుంది. పోలీసులు పూర్తిస్థారుు విచారణ జరిపితే.. చోరీలో ఎవరి హస్తం ఉందో వెల్లడి కానుంది.
     

మరిన్ని వార్తలు