రేపే నీట్‌ పరీక్ష

4 May, 2019 11:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక నీట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) పరీక్ష రేపు ఆదివారం జరగనుంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్‌లలోని పరీక్ష కేంద్రాలలో పరీక్షలు జరగనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నీట్‌ పరీక్ష జరగనుంది. పరీక్షకు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. 12 గంటల కల్లా పరీక్ష  కేంద్రాల్లో ఉండటం తప్పనిసరని అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 1:30 తర్వాత ఒక్కనిమిషం ఆలస్యం అయినా అనుమతి నిరాకరించబడుతుందన్నారు. ఈ సారి తెలంగాణలో దాదాపు 80వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి.

నిబంధనలు
బూట్లు, ఎత్తు మడిమల చెప్పులతో ప్రవేశ కేంద్రాల్లోకి అనుమతి నిషేధం. వాటర్ బాటిల్లు, తినుబండరాలు, స్టేషనరీ, ముద్రిత పత్రాలు, మొబైల్స్, కాల్క్యూలేటర్లు, గాజులు, గొలుసులు, చలువ కళ్ళద్దాలు, ఆభరణాలు ,టోపీలు, పర్సులు, షుగర్ వ్యాధిగ్రస్తులకు మాత్రం తినుబండారాలు తెచ్చుకునేందుకు అనుమతి ఉంది. సంప్రదాయ దుస్తులు, పొట్టి చేతులతో కూడిన తేలిక పాటివస్త్రాలు ధరించి పరీక్షకు హాజరు కావాలని అధికారుల సూచన. హాల్ టికెట్ తప్పని సరిగా ఉండాలి. హాల్ టికెట్లో పొందుపరిచిన ఫోటో కాపీ ఒకటి తీసుకెళ్లాలి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థి ఎదైనా గుర్తింపు కార్డు తప్పని సరిగాతెచ్చుకోవాలి. పరీక్షకు ఒక రోజు ముందే అంటే శనివారమే తమ పరీక్ష కేంద్రాలను చూసుకుంటే మంచిదని భారతీయ విద్యా మండలి సూచించింది.

మరిన్ని వార్తలు