చార్మినార్: జంతువులకూ కరోనా సోకుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నెహ్రూ జూలాజికల్ పార్కు అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. వన్య ప్రాణులకు వైరస్ సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. జంతువుల ఆరోగ్య పరిస్థితులను బేరీజు వేస్తున్నారు.
అమెరికాలోని న్యూయార్క్లో ఓ పెద్ద పులికి కరోనా వచ్చినట్లు వార్తలు రావడంతో...వన్యప్రాణుల ఎన్క్లోజర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. యానిమల్ కీపర్లు మాస్క్లు, గ్లౌజ్లతో పాటు చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లను వాడుతూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. జూపార్కులోని దాదాపు 150 మంది సిబ్బందికి జూ సర్వీస్ గేట్ వద్ద థర్మల్ స్కానింగ్ జరుపుతున్నారు. అంతేకాకుండా ఎన్క్లోజర్ల వద్ద ఫుట్బాత్ నిర్వహిస్తున్నారు.