డిప్యూటీ జయకేతనం

2 Jun, 2015 00:13 IST|Sakshi

 ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన నేతి విద్యాసాగర్
 విజయానికి అవసరమైన 17 ఓట్లు
 రావడంతో వరించిన విజయం
 మొదటి ప్రాధాన్యతలోనే గెలుపు
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ
 జిల్లాకు మరో ఎమ్మెల్సీ పదవి దక్కింది. తాజా మాజీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మరోమారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయన విజయానికి అవసరమైన 17 ఓట్లు రావడంతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. నేతి విద్యాసాగర్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఇది మూడోసారి. జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఈయన మండలిలో రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు.
 
  సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన మండలిలో ఆయన బలహీన వర్గాల కోటాలో డిప్యూటీ చైర్మన్ హోదాలో పనిచేశారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంతో ఆ పదవిలోనే కొనసాగారు. అనంతరం ఆయన పదవీకాలం ఇటీవలే ముగిసింది. అయితే, ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపుతారని అందరూ భావించినా, అనూహ్యంగా ఎమ్మెల్యే కోటాలో నామినేషన్ వేశారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఎన్నికలలో ఆయన ప్రథమ ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం విశేషం. నేతి గెలుపు పట్ల టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
 రాజకీయల ఆరంగేట్రం విద్యార్థి దశ నుంచే
 నకిరేకల్ : నేతి విద్యాసాగర్ పాఠశాల స్థాయి నుంచే కాంగ్రెస్ అనుంబంధ విద్యార్థి సంఘంలో పనిచేశారు. జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలందు కళాశాల అధ్యక్షుడిగా, ఆ తర్వాత కో ఆపరేటివ్ బ్యాంక్‌లొ  సైక్రటరీగా చేరి దానికి రాజీనామా చేసి. ప్రజాసేవ కోసం రాజకీయాలలోకి మరల ప్రవేశించారు.. అదే విధంగా ఎన్‌ఎస్‌యూఐ యూత్ కాంగ్రెస్‌లో వివిధ హోదాలో, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా అధ్యక్షుడిగా, పీసీసీ మెంబర్‌గా పదవులు నిర్వహించారు.  కేతేపల్లి వైస్ ఎంపీపీ పదవినికూడా చేపట్టారు.   చెర్కుపల్లి సర్పంచ్‌గా 15ఏళ్లు (మూడు దఫాలు) కొనసాగారు. అదే విధంగా పీఏసీయస్ శాలిగౌరారం చైర్మన్‌గా పనిచేశారు. రెండు పర్యాయాలు నల్లగొండ ఎమ్మెల్సీగా గెలిచారు.
 

మరిన్ని వార్తలు