మార్చిలో అందుబాటులోకి!

24 Dec, 2018 10:27 IST|Sakshi
కొనసాగుతున్న కలెక్టర్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులు

తుక్కుగూడ: కలెక్టరేట్‌ భవనంలో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్‌ పరిపాలన భవనాల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం మూడంతస్తుల్లో భవనాన్ని నిర్మిస్తుండగా అందులో మూడింటికీ స్లాబ్‌ పనులు పూర్తయ్యాయి. కలెక్టరేట్‌లో అంతర్భాగంగా ఉండే వివిధ శాఖల భవనాల నిర్మాణ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. పనులు ప్రారంభించి 14 నెలలు అయింది. ఇంకా గోడల నిర్మాణాలు, ఫ్లోరింగ్, టైల్స్, విద్యుత్, డ్రైనేజీ తదితర పనులు చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చిలోపు భవనం నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. భవనం పూర్తి కాగానే ఇక్కడి నుంచే జిల్లా పరిపాలన సాగనుంది. 

తీరనున్న కష్టాలు... 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు హైదరాబాద్‌ లక్డీకపూల్‌లోని కలెక్టరేట్‌ నుంచి పరిపాలన కొనసాగుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. ఈక్రమంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కొంగరకలాన్‌లో కలెక్టరేట్‌ నిర్మాణానికి స్థలం ఎంపిక చేసి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే.

కలెక్టరేట్‌కు ప్రభుత్వం కేటాయించిన భూములకు అధికారులు ఇప్పటికే  రక్షణ వలయాలను ఏర్పాటు చేశారు. ఓఆర్‌ఆర్‌ నుంచి కలెక్టరేట్‌కు చేరుకునేందుకు నాలుగు లేన్ల (100) ఫీట్ల బీటీ రోడ్డును ఆర్‌ఆండ్‌బీ అధికారులు సిద్ధం చేశారు. ఈ రోడ్డుకు మధ్యలో డివైడర్లను నిర్మించి విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరు వైపులా హరితహారంలో భాగంగా వివిధ  రకాల మొక్కులను కూడా పెంచుతున్నారు.

>
మరిన్ని వార్తలు