జాతీయ రహదారులుగా 3,135 కి.మీ.: వేముల

16 Sep, 2019 03:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటివరకు 3,135 కి.మీ రోడ్డును కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా జాతీయ రహదారులుగా ఆమోదించిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. వీటిలో 1,366 కి.మీలను కొత్త జాతీయ రహదారులుగా కేంద్రం ప్రకటించినట్టు చెప్పారు. మిగతా 1,769 కి.మీ పొడవును జాతీయ రహదారులుగా ప్రకటించాల్సి ఉందన్నారు. ఆదివారం కౌన్సిల్‌ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి వేసిన ప్రశ్నకు, బాలసాని లక్ష్మీనారాయణ, భానుప్రసాద్, జీవన్‌రెడ్డి, పురాణం సతీశ్‌ వేసిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 

‘రిజర్వాయర్‌ల వద్ద టూరిజం స్పాట్లు..’
రాష్ట్రంలోని పోచారం, శ్రీరాంసాగర్, కరీంనగర్, కోదండపూర్‌తో పాటు అన్ని రిజర్వాయర్‌ల వద్ద టూరిజం స్పాట్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నాగార్జునసాగర్, సోమశిల, తదితర ప్రాంతా ల్లో టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేసి, ప్రజలకు వివిధ సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా 35 హోటళ్లను నిర్వహిస్తున్నట్టు, 15 చోట్ల పర్యాటక ఆస్తులను హోటళ్ల నిర్వహణ కోసం లీజ్‌కు ఇచ్చినట్టు తెలిపారు. సభ్యులు గంగాధరగౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.


 

మరిన్ని వార్తలు