న్యూ ‘ఇయర్’ రూల్స్..!

30 Dec, 2014 03:21 IST|Sakshi

 భువనగిరి/ కోదాడటౌన్ : నవ వసంతానికి స్వాగతం పలికేందుకు యువత ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటుంటుంది. అయితే ఆనందంగా గడుపుకోవాల్సిన నూతన సంవత్సర వేడుకల్లో విషాదం నిండాకుండా ఉండేందుకు పోలీస్‌శాఖ కొన్ని సూచనలు చేసింది. హద్దు మీరితే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది.  రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు.. ఇంకెవరైనా సరే.. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలంటే ప్రభుత్వం జారీ చేసిన సరికొత్త నిబంధనలు పాటించాల్సిందే. ఈవెంట్ ఆర్గనైజర్లు ఎవరైనా వేడుకలను నిర్వహిస్తే ముం దస్తు అనుమతి తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి రూ.3వేల ఫీజు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండా వేడుకలు నిర్వహిస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని ఉన్నత స్థాయి నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. అంతేకాకుండా వేడుకలను నిర్ణీత సమయం వరకే  నిర్వహించాల్సి ఉంటుంది. అనుమతులు కోసం ఎక్సైజ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను జిల్లా అధికారులకు పంపి వారి ఆమోదం పొందిన అనంతరం అనుమతులు జారీ చేస్తారు.
 
 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
 నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సివిల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం మత్తులో రోడ్లపై మోటార్‌సైకిళ్లతో విన్యాసాలు చేస్తే వారి వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామంటున్నారు. వేడుకల పేరుతో శ్రుతిమించి వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. న్యూ ఇయర్ రోజున హోటళ్లు,  మ ద్యం దుకాణాలను రాతిర11 గంటల వరకు మూసివేయాలని, అనుమతులు తీసుకున్న వారు కూడా తమతమ ప్రదేశాల్లోనే ప్రశాం తంగా వేడుకలను నిర్వహించాలని, అనుమతి ఉన్న సమయం లోపే వాటిని ముగించాలని ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు.
 
 అనుమతులు తీసుకోవాలి : మల్లయ్య, ఎక్సైజ్ సీఐ, కోదాడ
 ఈవెంట్ ఆర్గనైజర్లు నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించినా, అందులో మద్యం వినయోగించినా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. రూ. 3 వేలు చలానా రూపంలో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
 
   పాటించాల్సిన నిబంధనలు...
     బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దు.
     డిసెంబర్31 వతేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే కార్యక్రమాలను నిర్వహించుకోవాలి.
     {పజలకు ఆటంకం కలగకుండా వేడుకలను నిర్వహించుకోవాలి.
     అనుమతి పొందిన కార్యక్రమాలను మాత్రమే నిర్వహించాలి.
     తాత్కాలిక స్టేజ్‌లను ఏర్పాటు చేస్తే తగిన పటిష్టత ఉందంటూ,అధికారు ల వద్ద అనుమతి పత్రం పొందాలి.
     వేడుకల్లో భాగంగా మద్యం ఇచ్చేలా ఉంటే దానికి సంబంధించిన అనుమతిని పొందాలి.
     హోటళ్లు, ఫాంహౌస్‌లకు వచ్చేవారి వాహనాలు నిలిపేందుకు తగిన పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలి.
     ముఖ్యైమైన ప్రాతాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలి
     అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హోటళ్లు, ఫాంహౌస్ నిర్వహకులు చర్యలు తీసుకోవాలి. ఒక వేళ ఏమైనా జరిగినా వాటికి హోటళ్లు ఫాంహౌస్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
     మద్యం తాగిన వారు తమ నివాసాలకు భద్రంగా చేరే విధంగా కార్యక్రమ నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేయాలి.
     నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే విదేశీయులకు సంబంధించిన వివరాలు సమీపంలోని పోలీసు స్టేషన్‌లో సమర్పించాలి.
     ఈత కొలనుపై తాత్కాలిక స్టేజ్‌లను ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు
     కొత్త సంవత్సరానికి వేసే లైటింగ్ విద్యుత్ సంబంధిత అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం జరిగితే విద్యుత్ శాఖ బాధ్యత వహించదు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవంటూ హెచ్చరిక జారీ చేసింది.
 

మరిన్ని వార్తలు