ప్రేమ జంటకు పోలీసుల రక్షణ

21 Feb, 2016 11:04 IST|Sakshi

శామీర్‌పేట్ : రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన యువతి, యువకుడు ప్రేమ వివాహం చేసుకోవడంతో గ్రామంలో శనివారం అర్ధరాత్రి పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన బాల మహేష్, ప్రియాంకలు  ప్రేమించుకుని ఈ నెల 18న ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం లక్ష్మాపూర్‌లో ఉంటున్నారు.

కాగా అల్వాల్‌లో ఉంటున్న ప్రియాంక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో.. వారు బంధువులతో కలసి శనివారం రాత్రి లక్ష్మాపూర్‌కు వెళ్లి మహేష్, అతడి తండ్రిపై దాడి చేశారు. దీనిపై మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం దాడి చేసిన వారిని పోలీసులు పిలిపించారు. పెళ్లి చేసుకున్న వారిద్దరూ మేజర్లు కావడంతో వారికి తాము రక్షణ కల్పిస్తామని సీఐ సత్తయ్య స్పష్టం చేశారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చి పంపించేశారు.

మరిన్ని వార్తలు