రాబోయే పది రోజులే కీలకం 

28 Mar, 2020 10:46 IST|Sakshi

గ్రేటర్‌లో పెరుగుతున్న క్లోజ్‌ కాంటాక్ట్‌ కేసులు  

నిన్న డాక్టర్‌ దంపతులు..నేడు ఆయన తల్లికి పాజిటివ్‌ 

గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు రెడ్ జోన్‌గా గుర్తింపు

14 రోజులపాటు ఇళ్లలోనే రెడ్‌జోన్ ప్రాంతం

ఇంటికే రేషన్, నిత్యావసర వస్తువుల సరఫరా

సాక్షి, హైదరాబాద్‌: అంతార్జతీయ విమాన సర్వీసులు రద్దు చేసి నేటికి వారం రోజులైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి డొమెస్టిక్‌ ఫ్లైట్స్‌ కూడా రద్దు చేసింది. ప్రస్తుతం విదేశాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా వైరస్‌ ఇంకుబేషన్‌ పీరియడ్‌ 14 రోజులు. ఇది మరో వారం రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం 25 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నారు. వీరిలో ఎంత మందికి లక్షణాలు బయట పడనున్నాయి..? వీరి నుంచి మరెంత మందికి వైరస్‌ విస్తరించి ఉంటుంది..? వంటి ప్రశ్నలకు రాబోయే ఈ వారం పది రోజుల్లో జవాబు దొరుకుతుంది. వచ్చే కేసులను బట్టే వైరస్‌ వ్యాప్తి ఏ దశలో ఉందనే అంశంపై ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత సంఖ్యతో పోలిస్తే రాబోయే వారం పది రోజుల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సామాజిక బాధ్యతలకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, ఇదొక్కటే వైరస్‌కు విరుగుడుకు మార్గమని సూచిస్తున్నారు. (కరోనా: ధోని విరాళం రూ. లక్ష.. సిగ్గు పడండి!)

ఆ ఆస్పత్రి పరిసరాల్లో భయం భయంగా.. 

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 59 పాజిటివ్‌ కేసులు నమోదైతే..వీటిలో అత్యధికంగా 40పైగా కేసులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే కావడం విశేషం. గురువారం దోమలగూడకు చెందిన డాక్టర్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, తాజాగా శుక్రవారం ఆయన తల్లికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో గ్రేటర్‌లో ఇప్పటి వరకు లోకల్‌ కాంటాక్ట్‌ల సంఖ్య ఆరుకు చేరింది. ఇదిలా ఉంటే డాక్టర్‌ దంపతులకు వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో సోమాజిగూడలోని ఆయన పని చేస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రిలో ఇప్పటికే చికిత్స పొందుతున్న రోగులు, వారికి సహాయంగా వచ్చిన బంధువులు, ఇతర వైద్య సిబ్బందితో పాటు ఆస్పత్రి చుట్టు పక్కల ఉన్న అపార్ట్‌మెంట్‌ వాసుల్లో ఆందోళన మొదలైంది. (కరోనా : డబ్ల్యూహెచ్ హెచ్చరిక!)
 
కార్పొరేట్‌ వైద్యులపై విమర్శల వెల్లువ.. 
నగరంలో అనేక కార్పొరేట్‌ ఆస్పత్రులు ఉన్నాయి. ప్రముఖ వైద్య నిపుణులు ఉన్నారు. కానీ వీరిలో ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా పాజిటీవ్‌ బాధితులకు, అనుమానంతో వస్తున్న బాధితులకు చికిత్స అందించేందుకు ముందకురాక పోవడంపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీ, ఫీవర్, ఛాతి ఆస్పత్రుల్లో చికిత్సలు అందిస్తున్న ప్రభుత్వ వైద్య సిబ్బందిపై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇదిలా ఉంటే నగరంలో ఒక్కో కార్పొరేట్‌ ఆస్పత్రికి ఒకే పేరుతో రెండు మూడు బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వనరులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కానీ వాటిని వదిలేసి కరోనా చికిత్సల పేరుతో పేదలు చికిత్స పొందే గాంధీని పూర్తిగా ఖాళీ చేసి వాటిని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. (తెలంగాణ: ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్)

ఇదిలా ఉంటే విదేశాల నుంచి వచ్చిన వారిని సెల్ఫ్‌ క్వారంటైన్‌ చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ, పోలీస్, అధికారుల బృందం రెడ్‌జోన్‌గా ప్రకటించింది. ఇలా రెడ్‌ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు తగిలించారు. ఆ నివాసాల్లోకి ఎవరూ వెళ్లవద్దంటూ కచ్చితమైన సూచనలు జారీ చేశారు. నిత్యం ఆ ప్రాంతాలు తమ పర్యవేక్షణలో ఉంటాయని సూచిస్తున్నారు. ఇలా కోవిడ్‌–19 క్వారంటైన్‌ రెడ్‌జోన్‌ బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో చుట్టుపక్కల నివాసితులు అప్రమత్తంగా ఉండి ఆ ప్రాంతాల సమీపంలోకి వెళ్లకూడదని అధికారులు పేర్కొంటున్నారు.  చందానగర్‌, కోకాపేట, గచ్చిబౌలి..తుర్కయాంజల్‌, కొత్తపేట రెడ్‌ జోన్‌లో ఉన్నాయి. (ఒకేరోజు 14 మందికి కరోనా పాజిటివ్)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు