రాత్రికి రాత్రే వెలిసిన పోచమ్మ!

28 Mar, 2018 07:31 IST|Sakshi
భీమారం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఉన్న భూమిలోవెలిసిన పోచమ్మ విగ్రహం, ఏర్పాటు చేసిన జెండాలు 

పోలీస్‌స్టేషన్‌ భవన ప్రతిపాదిత భూమిలో పోచమ్మ ఏర్పాటు

భీమారం(చెన్నూర్‌) : మంచిర్యాల జిల్లా భీమారంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్‌ స్టేషన్‌ భవన ప్రతిపాదిత స్థలంలో సోమవారం రాత్రి పోచమ్మ విగ్రహం దర్శనం ఇచ్చింది. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసిన సమయంలో భీమారం ను కూడా కొత్త మండలంగా  ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2016 దసరా రోజున కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో పలు భవనాల్లో కార్యాలయాలు ప్రారంభించారు. సంవత్సరం అనంతరం మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ భవనం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రభుత్వ స్థలాల్లో ఒక ఎకరం భూమి కేటాయించాలని పోలీస్‌ శాఖ రెవెన్యూ శాఖకు లేఖ రాసింది. ఈమేరకు పలు స్థలాలు కేటాయించినా అవి మధ్యలోనే నిలిచి పోయాయి. దీంతో సర్వే నెంబర్‌ 411లోని 19 గుంటల భూమి కేటాయించాలని జైపూర్‌ ఏసీపీ సీతారాములు  ఆర్డీవో శ్రీనివాస్‌ను కోరగా ఆర్డీవో భీమారం వచ్చి ప్రస్తుత పోలీస్‌ స్టేషన్‌ ఎదురు స్థలాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆ భూమిలో సోమవారం రాత్రి పోచమ్మ ప్రతిష్ఠాపన జరిగింది. దీంతో పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని వార్తలు