ధాన్యం కొనుగోళ్లు నాలుగింతలు

13 Jun, 2019 02:49 IST|Sakshi

పౌర సరఫరాల మంత్రి నిరంజన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు గడిచిన ఐదేళ్లలో 4 రెట్లు పెరిగాయి. కనీస మద్దతు ధరలకు జరుగుతున్న కొనుగోళ్లు, మార్కెట్‌ వ్యవస్థ బలోపేతం, సాగునీటి వనరుల వృద్ధితో పంటల విస్తీర్ణం పెరగడం, వీటికి అనుగుణంగా సేకరణను ఆ శాఖ విస్తరించడంతో ధాన్యం కొనుగోళ్లు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. 2014–15లో ఖరీఫ్, రబీ సీజన్‌ల్లో కలిపి మొత్తంగా 24.29 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేయగా, రూ.3,392 కోట్లను రైతులకు చెల్లించారు. అది 2016–17, 2017–18 నాటికి 53.90 లక్షల టన్నులకు చేరగా, అదే 2018–19 నాటికి 73.02 లక్షల టన్నులకు చేరింది.

ఈ సేకరించిన ధాన్యం విలువ రూ.12,906 కోట్లుగా ఉంది. అది ప్రస్తుత 2019–20 నాటికి 80 లక్షల టన్నులను దాటే అవకాశం ఉంది. ఇప్పటికే 77.07 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి గతంలో ఎన్నడూలేని రికార్డులు నెలకొల్పింది. గడిచిన ఐదేళ్లలో పౌర సరఫరాల శాఖ పరిధిలో చేపట్టిన సంస్కరణలు, వాటి ఫలితాలకు సంబంధించి ‘పౌర సరఫరాల శాఖ వార్షిక నివేదిక 2018–19’ని పౌర సరఫరాల శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. నివేదికలో ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.  

మరిన్ని వార్తలు