నిజామాబాద్‌ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌కు కరోనా లక్షణాలు

19 Mar, 2020 14:29 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: చైనాలో ఉద్భవించి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19) బాధితుల సంఖ్య తెలంగాణలో రోజురోజుకి పెరుగుతోంది. తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ నరేష్‌కు కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. జిల్లాలోని రామారెడ్డి మండలం​ రెడ్డిపేట్‌ స్కూల్‌ తండావాసి అయిన నరేష్‌కు తీవ్రమైన దగ్గు, తుమ్ములు రావడంతో అతన్నికామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే జమ్మూ కశ్మీర్‌లో నరేష్‌ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 13న ఢిల్లీ నుంచి బయలుదేరిన ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌ 9 బోగిలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. (రాష్ట్రంలో హై అలర్ట్‌)

కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా కరోనా అనుమానిత  బాధితులతో నరేష్‌ ప్రయాణించడం వల్ల కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. దీంతో కామారెడ్డి జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. అదేవిధంగా బాధితుడిని హైదరాబాద్‌లోని చెస్ట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చెస్ట్ ఆస్పత్రి వైద్యులు అతనికి పరీక్షలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పరీక్షల అనంతరం ఐసోలేషన్ వార్డ్‌కు తరలించి వైద్యం అందిస్తారని సమాచారం. అదేవిధంగా బుధవారం ఒక్కరోజే 8 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు  కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 13కు చేరిన విషయం తెలిసిందే. (ఆ బోగీలో 82 మంది)

మరిన్ని వార్తలు