సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల వాయిదాపై 16 మంది రైతులు వేసిన పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్కు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ పత్రాలు ఉంటేనే విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. దాంతో నామినేషన్ పత్రాలు సకాలంలో అందలేదని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు.
నామినేషన్ పత్రాల సమర్పణకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. అంతేకాక ఎన్నికల నిబంధన ప్రకారం ప్రతి స్వతంత్ర అభ్యర్థికి గుర్తును కేటాయించాలని రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ మేరకు తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.