హైకోర్టును ఆశ్రయించిన అన్నదాతలు

5 Apr, 2019 17:29 IST|Sakshi

పోలింగ్‌ను వాయిదా వేయాలని.. 

పేపర్‌ బ్యాలెట్‌ ద్వారాఎన్నికలు జరపాలని.. 

ఈనెల 8కి తీర్పు వాయిదా వేసిన న్యాయస్థానం

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పోలింగ్‌ను వాయిదా వేయాలని, పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా పోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ ఎన్నికల బరిలో నిలిచిన రైతులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు 16 మంది రైతు అభ్యర్థులు పిటీషన్‌ వేశారు. రైతుల పిటీషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును ఈనెల 8కి వాయిదా వేసింది. గుర్తుల కేటాయింపు ప్రక్రియ నిబంధనల మేరకు జరగలేదని, ప్రధాన పార్టీల అభ్యర్థులు మూడు నెలల నుంచి ప్రచారం నిర్వహించుకుంటున్నారని, తమకు ప్రచారం నిర్వహించుకునేందుకు సమయం లేకుండా పోయిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని రైతుల తరపున న్యాయవాది రచనారెడ్డి హైదరాబాద్‌లో మీడియాకు వెల్లడించారు.

రెండో విడతలో పోలింగ్‌ నిర్వహించాలని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లినట్లు రచనారెడ్డి పేర్కొన్నారు. గుర్తు కేటాయింపునకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని కోర్టు పిటీషన్‌ వేసిన రైతులను ఆదేశించినట్లు తెలుస్తోంది. తీర్పు సోమవారం వెలువడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

మరిన్ని వార్తలు