సౌదీలో నిజామాబాద్‌వాసి హత్య

9 Nov, 2015 14:41 IST|Sakshi

పదహారు నెలల తర్వాత వెలుగులోకి..

మోర్తాడ్: ఉపాధి కోసం సౌదీ వెళ్లిన ఓ వ్యక్తి పదహారు నెలల క్రితం అదృశ్యంగా కాగా, అతడిని దారుణంగా హత్య చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ కేంద్రంగా పని చేస్తున్న గల్ఫ్ రిటర్నింగ్ మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి చాంద్‌పాష ఈ మిస్టరీని ఛేదించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన సైద్ సయ్యద్ గతేడాది జూన్‌లో సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్ వెళ్లాడు. అక్కడ మున్సిపాలిటీలో క్లీనింగ్ సెక్షన్‌లో పని చేసేందుకు సైద్ సయ్యద్ నియమితుడయ్యారు.

సౌదీకి చేరిన వెంటనే ఉద్యోగ నిబంధన ప్రకారం యాజమాన్యం అతనిని మెడికల్ టెస్ట్ కోసం పంపించింది. అలా వెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయాడని అక్కడి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. తర్వాత సయ్యద్ మృతదేహం రియాద్ శివార్లలో లభించింది. సయ్యద్‌తో పాటు వెళ్లిన మన దేశ కార్మికుడితో పాటు, నేపాల్ జాతీయుడు కలిసి సయ్యద్‌ను హత్య చేసినట్లు నిర్ధారించి.. వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే, ఈ విషయం ఇక్కడి సయ్యద్ బంధువులకెవరికీ సమాచారం లేకుండా పోయింది. సౌదీకి చేరిన తర్వాత సయ్యద్ నుంచి ఎలాంటి ఫోన్‌కాల్, ఉత్తరం కానీ లేకపోవడంతో అతని భార్య జరీనాబేగం ఏజెంట్లను వాకబు చేసింది. వారు చేతులెత్తేయడంతో పోలీసులను ఆశ్రయించింది. వారు సయ్యద్‌కు సంబంధించి న సమాచారం సేకరించలేకపోయారు.

చివరకు జీఆర్‌ఎండబ్ల్యూఎస్ సంస్థను ఆశ్రయించగా చైర్మన్ చాంద్‌పాషా మన దేశ విదేశాంగ శాఖను సంప్రదించారు. సైద్ సయ్యద్‌కు హత్యకు గురయ్యాడని శవం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉందని సమాచారం రావడంతో ఈ విషయాన్ని చాంద్‌పాషా సయ్యద్ భార్య, ఇతర కుటుంబ సభ్యులకు తెలిపారు. కంపె నీ యాజమాన్యంతోపాటు, అక్కడి విదేశాంగ శాఖ నిర్లక్ష్యం కారణంగా సయ్యద్ హత్య విషయం పదహారు నెల ల తర్వాతగానీ కుటుంబ సభ్యులకు తెలియలేదు. మృతదేహం కుళ్లిపోవడంతో అక్కడే అంత్యక్రియలు చేసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు