‘మద్దతు’ కోసం మరో పోరాటం

5 Aug, 2019 13:11 IST|Sakshi
బాల్కొండలో సాగవుతున్న పసుపు పంట

ఎన్నికల్లో నేతల రాతలు మార్చిన పసుపు రైతులు

మద్దతు ధర కోసం 15 ఏళ్లుగా పోరాటం

పసుపు బోర్డు కోసం మరో ఉద్యమానికి సిద్ధం

ఈ నెల 15 వరకు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌

సాక్షి, బాల్కొండ: గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రముఖ నేతల రాతలు మార్చిన పసుపు రైతులు మరో పోరాటానికి సిద్ధం అవుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు బోర్డుతో ముందుంటానని  మాట ఇచ్చిన నాయకులు ఇప్పుడు మీనమేషాలు లేక్కపెడుతుండంతో రైతులు ఇక వేచి చూడడం తమ వల్ల కాదంటూ పోరుబాటకు సిద్ధపడుతున్నారు. ఈ నెల 15 డెడ్‌లైన్‌తో ఆధికార పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. కనీసం మద్దతు ధర కల్పించర అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధిక పెట్టుబడితో, దీర్ఘకాల పంటగా సాగు చేసే పసుపుకు ఇప్పటికైన మద్దతు ధర దక్కదా? పసుపు బోర్డు ఏర్పాటు కాదా ?అనే అనుమానాలు సామాన్య రైతులను ఇప్పటికి వెంటాడుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు పసుపు రైతులు భారీ ఉద్యమం చేపట్టి నేతల తల రాతాలను మార్చారు. కాని పసుపు రైతుల రాత మాత్రం మారలేదు. ధరపై ఇంకా భరోసా లభించలేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హమీలిచ్చిన నేతలను నిలదీస్తుమంటున్నారు.

జిల్లాలో తల్లిపంటగా భావించి 33 వేల ఎకరాల్లో పసుపును సాగు చేస్తారు. పసుపుకు అధిక పెట్టుబడితో, దీర్ఘకాలిక పంట కావడంతో అన్నదాతల శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయాల పెట్టుబడి అవుతుంది. మంచి దిగుబడి, మార్కెట్‌లో ఆశించిన ధర పలికితే ఎకరానికి 2.5 లక్షల ఆదాయం వస్తుంది అని రైతులు అంటున్నారు. కాని ప్రస్తుతం ఉన్న ధరలతో పెట్టిన పెట్టుబడి కూడ గిట్టని పరిస్థితి ఉంది.

పదిహేనేళ్లుగా పోరాటం
పసుపు ప్రత్యేక బోర్డు కోసం, మద్దతు ధర కోసం రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రైతన్నలు పదిహేనేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. కాని ఇప్పటి వరకు ఉలుకు, పలుకు లేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అయిన రైతులు పసుపుకు మద్దతు ధర దక్కేల చూడాలని పోరాటాలను చేస్తునే ఉన్నారు. ఇప్పుడైన కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నెల 15 వరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించకుంటే అందోళనలు తీవ్రతరం చేస్తామని రైతు ఐక్య కార్యచరణ కమిటీ నాయకులు హెచ్చరిస్తున్నారు.

వైఎస్‌ హయంలో  స్వర్ణయుగం
పసుపు రైతులకు దివంగత ముఖ్యమంత్రి రాజాశేఖర్‌రెడ్డి హయంలో స్వర్ణయగంగా చెప్పుకోవచ్చు. పసుపును మార్క్‌ఫేడ్‌ ద్వారా కొనుగోలు చేపించడంతో క్వింటాకు రూ.17వేలు పలికింది. దీంతో పసుపు కోసం పోరాటాలు చేసిన ప్రతి సందర్భంలో రైతులు దివంగత నేతను యాది చేస్తునే ఉంటారు. వైఎస్‌ హయంలోనే పసుపు రైతులు లాభాలను చూశారు. కాని తరువాత వచ్చిన పాలకులు పసుపు పంటకు క్వింటాళుకు 4 వేల రూపాయాలు సరిపోతుందని నివేదికలు ఇచ్చి పసుపు రైతల నోట్లో మట్టి కొట్టారు.

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి
పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని గత లోక్‌సభ ఎన్నికల్లో నిజమాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలి. పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి. లేదంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. ధర లేక పోతే పంటను సాగు చేసి ఏం లాభం.
- బుల్లెట్‌ రాం రెడ్డి

మద్దతు ధర ప్రకటించాలి
పసుపు పంటకు క్వింటాకు రూ.15వేల మద్దతు ధరను వెంటనే ప్రకటించాలి. ఎన్నికలకు ముందు అది చేస్తాం.. ఇది చేస్తామని నాయకులు ఇప్పుడు మోసం చేసీ మొఖం చాటేస్తున్నారు. మద్దతు ధర ప్రకటించకుంటే ఉద్యమం పెద్దగ చేస్తాం. పసుపు రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి.
- ముస్కు రాజేశ్వర్‌

మరిన్ని వార్తలు