ఆ భవనం లీజుకివ్వడం సరికాదు

17 Jun, 2018 03:59 IST|Sakshi

నిజాం ఆస్తిని ప్రభుత్వం ఎలా లీజుకిస్తుంది?

హైకోర్టులో ఏడో నిజాం మునిమనుమరాలి పిటిషన్‌  

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా, అల్వాల్‌లో ఏడో నిజాం నవాబ్‌ సర్‌ మీర్‌ ఉస్మాన్‌ మీర్‌ అలీఖాన్‌ బహదూర్‌కు చెందిన 28.48 ఎకరాల్లో ఉన్న ప్యాలెస్‌ను లీజుకివ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఏడో నిజాం మునిమనుమరా లు ప్రిన్సెస్‌ షఫియా సకినా రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయ పోరాటం ప్రారంభించారు. ఏడాదికి రూపాయి చొప్పు న 99 ఏళ్ల పాటు భారతీయ విద్యాభవన్‌కిచ్చిన లీజును రద్దు చేసి ఆ ప్యాలెస్‌ను తనకు స్వాధీనం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటి షన్‌ దాఖలు చేశారు.

ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ సీఎస్, భారతీయ విద్యాభవన్‌ ప్రెసిడెం ట్, డిఫెన్స్‌ ఎస్టేట్‌ ఆఫీసర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైదరాబాద్‌ విలీనం తరువాత తమ ఆస్తుల జాబితాను కేంద్ర హోంశాఖకు ఏడో నిజాం సమర్పించారని, వాటిని అనుభవించేందుకు కేంద్రం అనుమతించిందని ఆమె తెలిపారు.

ఏడో నిజాం ఆస్తుల వివరాలు ‘బ్లూ బుక్‌’లో స్పష్టంగా ఉన్నాయన్నారు. వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవన్నారు. ఇలాంటి ఆస్తుల్లో అల్వాల్‌ సర్వే నంబర్‌ 157లో ఉన్న కోఠీ ఆసీఫియా ప్యాలెస్‌ కూడా ఒకటని, ఇది 28.48 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. కంటోన్మెంట్‌ రిజిస్టర్‌లో ఈ ఆస్తి నిజాం ఆస్తిగానే రాసి ఉందన్నారు.

చట్ట ప్రకారం విలువ లేని లీజ్‌ ఇది...
ఏడో నిజాం చనిపోయిన తరువాత వారసుల మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయని, దీంతో అల్వాల్‌లోని ప్యాలెస్‌ను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1981లో ఆ ప్యాలెస్‌ను భారతీయ విద్యాభవన్‌కు 99 ఏళ్ల పాటు ఏడాదికి రూపాయి చొప్పున లీజుకు ఇచ్చిం దని ఆమె వివరించారు. 11 నెలల్లోపు రిజిస్టర్‌ కావాల్సిన ఈ లీజు డీడ్‌ ఆ లోపు రిజిస్టర్‌ కాలేదని, అందువల్ల దానికి చట్ట ప్రకారం విలువ లేదన్నారు.

లీజుకు తీసుకున్న ప్యాలెస్‌లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని ఆమె వివరించారు. ఇప్పటికే భారతీయ విద్యాభవన్‌ నిర్వాహకులు ఆ ప్యాలెస్‌ అందాన్ని చెడగొట్టారని, అద్భుతమైన ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని తెలిపారు. ఆ భవనాన్ని స్వాధీనంలో ఉంచుకుని వాడుకుంటున్నందుకు నెలకు రూ.25 లక్షలను డిపాజిట్‌ చేసేలా కూడా ఆదేశాలు జారీ చేయాలన్నారు.   

మరిన్ని వార్తలు