జంటనగరాల ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్న హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు లేవని, దీనిపై వస్తున్న వదంతులను నమ్మొద్దని ఎల్అండ్టీ మెట్రోరైలు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు అమలు విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిపై ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతూనే ఉంటాయని అధికారులు చెప్పారు. ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు లేవని, కొంతమంది కావాలనే దీనిపై వదంతులు సృష్టిస్తున్నారని ఎల్అండ్టీ మెట్రో రైలు అధికారులు చెప్పారు.
అయితే.. ప్రస్తుత రాజకీయ, భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో మెట్రోరైలు ప్రాజెక్టు మనుగడ సాధించడం కష్టమని, అందువల్ల తాము టేకోవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎల్అండ్టీ మెట్రోరైలు అధికారులు ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు మీడియాలో వచ్చింది. ఇక తాము ఈ ప్రాజెక్టును చేపట్టలేమని, మీరే కట్టుకోవాలని వారు చెప్పినట్లుగా ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇప్పుడు వాటిని ఎల్అండ్టీ వర్గాలు ఖండించాయి.