గాంధీలో పేషెంట్ల పరిస్థితి దయనీయం

4 Jul, 2020 14:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  పోరాడాల్సింది వ్యాధితో.. రోగితో కాదని ప్రభుత్వం ఓవైపు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా... కరోనా వైరస్‌ సోకి ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి దారుణంగా ఉంది. తాజాగా హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో బాధితులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితికి ఈ వీడియో అద్ధం పడుతోంది. కోవిడ్‌ వార్డుల్లో అటెండర్లు లేక కరోనా పేషెంట్లు ఆరు బయటే పడి ఉన్నారు. కనీసం సాయం చేసేవారు లేక ఇద్దరు రోగులు అవస్థలు పడుతున్నారు. 60మంది కరోనా పేషెంట్లకు కేవలం నలుగురు మాత్రమే వార్డు బాయ్స్‌ ఉన్నారు. మరోవైపు కరోనా కేసులతో గాంధీ ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

కరోనా వల్లే మృతి చెందాడని... 
కరోనా మహమ్మారి బంధుత్వాలను, మానవతా విలువలను మంటగలిపింది. వివరాళ్లోకి వెళితే.. టోలిచౌకి పారామౌంట్‌ కాలనీలోని ఓ భవనంలో మొదటి అంతస్తులో హారూన్‌ షా అద్దెకు నివాసముంటున్నాడు. ఇతని కుటుంబ సభ్యులు ఉద్యోగ రీత్యా వేర్వేరు నగరాల్లో ఉంటున్నారు. గత నెల 30వ తేదీన ఇతను భోజనం చేస్తుండగా ఒకేసారి కుప్పకూలిపోయి కిందబడటంతో పెద్ద శబ్దం వచ్చి పక్క ఫ్లాట్‌ వాళ్లు వచ్చి చూసి వెళ్లిపోయారు. మరుసటి రోజు హారూన్‌ షా మృతి చెందాడని తెలవడంతో కరోనా వల్లే మృతి చెందాడని స్థానికంగా పుకార్లు లేచాయి. 

ఈ పుకార్లతో హారూన్‌ ఇరుగుపొరుగు వారు తమ ఫ్లాట్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు మృతదేహాన్ని చూసి వెళ్లిపోయారే తప్పా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా మృతుడి దూరపు బంధువైన ముజాహెద్‌ అనే వ్యక్తి విషయం తెలుసుకుని అక్కడికి వచ్చాడు. స్థానికులెవరూ అంత్యక్రియలకు సహకరించకపోవడంతో ముజాహెద్‌ సఖీనా ఫౌండేషన్‌ వారిని సంప్రదించాడు. గతంలో అనాథలు, కోవిడ్‌–19తో మృతి చెందిన వారికి సఖినా ఫౌండేషన్‌ అంత్యక్రియలు నిర్వహించింది. 

మరిన్ని వార్తలు