18 నెలలకు సరిపడా ఆహార నిల్వలు

8 Apr, 2020 04:17 IST|Sakshi

దక్షిణాది రాష్ట్రాలకు ఆహార ధాన్యాల కొరత లేదన్న ఎఫ్‌సీఐ

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) కింద పంపిణీ చేసేందుకు 18 నెలలకు సరిపడే ఆహార ధాన్యాల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ప్రకటించింది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అవసరమైన ఆహార ధాన్యాలను సిద్ధం చేశామని తెలిపింది. ఈ మేరకు ఎఫ్‌సీఐ తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ రీజియన్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ విక్టర్‌ అమల్‌రాజ్‌ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ఆహారధాన్యాలను సరఫరా చేయడంతో తెలంగాణ రీజియన్‌ శాఖ విశేష కృషి చేస్తోందని వెల్లడించింది. దీంతోపాటే తెలంగాణ పీడీఎస్‌ అవసరాలకు బియ్యం సరఫరా చేస్తోందన్నారు.

మరిన్ని వార్తలు