కాలుష్య రహిత వాహనాలనే నడిపిద్దాం

10 Nov, 2018 11:21 IST|Sakshi

దేశానికి జనగామ ఆదర్శంగా నిలవాలి

గుడ్‌లక్‌ వెహికిల్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ పెద్ది శరత్, డైరెక్టర్‌ రవీందర్‌

జనగామలో ఎలక్ట్రిక్‌ ఆటోల ఆవిష్కరణ

సాక్షి,జనగామ: కాలుష్య రహిత వాహనాలను నడిపిస్తూ రాబోయే తరాలకు సంపూర్ణ ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని గుడ్‌లక్‌ వెహికిల్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ పెద్ది శరత్, డైరెక్టర్‌ రవీందర్‌ అన్నారు. ఎలక్ట్రికల్‌ ఆటోల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది.ఈ సందర్భంగా గుడ్‌లక్‌ వెహికిల్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ పెద్ది శరత్, డైరెక్టర్‌ రవీదర్‌ మాట్లాడుతూ నాలుగు బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రికల్‌ ఆటోలు ఎనిమిది గంటల పాటు చార్జింగ్‌ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని తెలిపారు.

విద్యుత్‌ కేవలం నాలుగు యూనిట్లు మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. ఒక కిలోమీటరు ప్రయాణానికి ఖర్చు 30 పైసలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్యాసింజర్‌ ఆటో ధర రూ.1,25 లక్షల నుంచి రూ.1,40లక్షలు, ట్రాలీ ఆటో ధర రూ.1,25 లక్షల నుంచి రూ.1,35 లక్షల వరకు ఉందని తెలిపారు. 25 కిలోమీటర్ల వేగంతో నడిచే ఆటోలకు ఆర్టీ అప్రూవల్‌ లేకున్నా రోడ్డుపై తిరగవచ్చన్నారు. అత్యవసర సమయంలో బ్యాంకు రుణం, బీమా పొందాలనుకునే యజమానులు వెహికిల్‌ రిజిష్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఓజోన్‌ పొరపై పొల్యూషన్‌ చూపిస్తున్న ప్రమాద సంకేతాలను దృష్టిలో ఉంచుకుని కాలుష్య రహిత ఆటోలను మాత్రమే వినియోగించాలని సూచించారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా బ్రాంచీలను స్థాపించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో జనగామ మునిసిపల్‌ కమిషనర్‌ రవీందర్‌ యాదవ్, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రంగు వీరస్వామి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి కేఆర్‌ లత, మతిన్, వెంకటేశ్వర్లు, ఆటో యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు