మిలీనియల్సే టాప్‌

28 Nov, 2019 02:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆన్‌లైన్‌ వ్యవహారాల్లో వారిదే హవా..

నమ్మకమైన సైట్లలో బ్యాంకు వివరాలు భద్రపరిచేందుకూ సై

వ్యక్తిగత సమాచారం పంచుకోవడమూ ఓకే 

‘నార్టన్‌’ డిజిటల్‌ వెల్‌నెస్‌ సర్వే వెల్లడి

ఆన్‌లైన్‌ మోసాల గురించి మనం తరచూ వింటుంటాం. అయినా సరే.. షాపింగ్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ తెరిచి కొనుగోళ్లు మాత్రం ఆపం. బిల్లులు కట్టేందుకూ, బ్యాంకు లావాదేవీలు నడిపేందుకు అస్సలు వెనుకాడం. ఇంటిపట్టున ఉంటూ పనులన్నీ చక్కబెట్టే వెసులుబాటు, సౌకర్యం ఉండటం, సమయం ఆదా అవుతోందన్నది దీనికి కారణం. ఇలాంటి లాభాలన్నీ ఉన్నాయని ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఖాతాల్లో డబ్బులు ఖాళీ అయిపోవచ్చు. మీకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఇతరులకు చేరనూ వచ్చు. ఇంతకీ దేశంలో పురుషులు, మహిళలు, ఈతరం, వెనుకటి తరం ఆ ముందు తరాల ఆన్‌లైన్‌ షాపింగ్, బ్యాంకింగ్‌ వ్యవహారాల తీరుతెన్నులెలా ఉన్నాయి? ఇంటర్నెట్‌ భద్రత సంస్థ ఈ విషయాన్ని కనుక్కునేందుకు డిజిటల్‌ వెల్‌నెస్‌ సర్వే ఒకటి నిర్వహించింది. ‘ఆన్‌లైన్‌’ మిలీనియల్స్‌ (25– 34 మధ్య వయస్కులు) టాప్‌లో ఉన్నారు.

83 శాతం
ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌లో ఆర్థిక మోసాలు, సమాచార చోరీ అన్నవి రెండు పెద్ద ప్రమాదాలని తెలిసిన వారు


ఇవీ జాగ్రత్తలు...
- వేర్వేరు వెబ్‌సైట్లకు వేర్వేరు పాస్‌వర్డ్‌లు వాడటం మేలు. అంకెలు, గుర్తులు, అక్షరాలు కలిసి పాస్‌వర్డ్‌ ఉండాలి.
సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా దృష్టి పెట్టేది సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలపైనే. కాబట్టి సాఫ్ట్‌వేర్‌ లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి.
షాపింగ్‌ వెబ్‌సైట్‌ ‘హెచ్‌టీటీపీఎస్‌’తో మొదలవుతోందా? లేదా చూసుకోండి. బ్రౌజర్‌ బార్‌లో ఒకవైపు తాళం కప్ప వేసిన గుర్తు అది కూడా పచ్చ రంగులో ఉంటే ఆయా వెబ్‌సైట్ల సమాచారం ఎన్‌క్రిప్షన్‌ (రహస్య సంకేతాలతో కూడిన భాష)ను ఉపయోగిస్తుందని అర్థం. ఇలాంటి వెబ్‌సైట్లలోకి చొరబడటం హ్యాకర్లకు కష్టం. 
గుర్తుతెలియని వ్యక్తులు/కంపెనీల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్‌ చేయకపోవడం మంచిది. ఇలాంటివి మిమ్మల్ని ఏదో ఒక వెబ్‌సైట్‌కు తీసుకెళ్లి వ్యక్తిగత వివరాలు రాబట్టుకునే చాన్స్‌ ఉంది. 
ఫేక్‌ వెబ్‌సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి.  వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఫేక్‌ వెబ్‌సైట్లను సృష్టిస్తుం టారు హ్యాకర్లు. ఇంటర్నెట్‌ సెక్యూరిటీ కోసం  పూర్తిస్థాయి సూట్‌ను వాడటం మేలు. ఇందుకు వెచ్చించే మొత్తం మీకు మాల్‌వేర్, ర్యాన్‌సమ్‌వేర్, వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

సర్వే నిర్వహణ ఇలా...
దేశం మొత్తమ్మీద సుమారు 1,572 మందిని నార్టన్‌ లైఫ్‌లాక్‌ సంస్థ సర్వే చేసింది. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ను ఉపయోగించే వారు, 18 ఏళ్లకంటే ఎక్కువ వయసున్న వారిని ఎంపిక చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 8 – 16 తేదీల్లో జరిగిన ఈ సర్వేలో విద్యార్హతలు, ఆదాయం అంశాల ఆధారంగా విభజించిన ఇళ్లలోని వ్యక్తులను ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు