ఆస్పత్రుల పనితీరు అధ్వానం

7 Aug, 2014 00:32 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు తిరోగమనబాట పడుతోంది. నిరుపేదలకు సైతం మెరుగైన వైద్యసేవలందిస్తామంటూ ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఢంకా బజాయించి మరీ చెబుతుండగా.. జిల్లాలోని సర్కారు ఆస్పత్రులు మాత్రం సేవలకు దూరంగా ఉంటున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై యంత్రాంగం ప్రత్యేక సర్వే నిర్వహించగా పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. జి ల్లాలో 48ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు.. 2పీపీ యూనిట్లు కలిపి మొ త్తం 50 ఆస్పత్రులున్నాయి. అయితే వీటిలో ఏ ఒక్క ఆస్పత్రిలో కూడా మె రుగైన వైద్య సేవలందడం లేదని స ర్వేలో వెలుగు చూడడం గమనార్హం.

 అన్నీ అధ్వాన్నమే..!
 రోగాల్ని నయం చేసి సమాజాన్ని ఆరోగ్యకరంగా ఉంచాల్సిన వైద్య,ఆరోగ్య శాఖ అవినీతి, అక్రమాలమయంగా మారింది. ఇటీవల ఏకంగా జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుపడడం సంచలనం రేపింది. జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు ప్రైవేటు వైపు ఆసక్తి చూపుతూ రోజువారీ విధులకు ఎగనామం పెడుతున్నారు.

 ఈ అంశంపై జిల్లా వైద్య,ఆరోగ్య శాఖలో పలు ఫిర్యాదులున్నాయి. డాక్టర్లు ప్రైవేటు విధుల బాట పట్టడంతో సర్కారు ఆస్పత్రుల్లో కిందిస్థాయి సిబ్బందే వైద్యపరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో క్రమంగా ఆస్పత్రులకు రోగుల తాకిడీ తగ్గిపోతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఆధారంగా వాటికి సర్కారు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. వైద్యపరీక్షలు, ఇమ్యునైజేషన్, గర్భిణీ పరీక్షలు, డెలివరీలు తదితర అంశాల ఆధారంగా ఆయా ఆస్పత్రులకు మార్కులు వేస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆస్పత్రులను పరిశీలిస్తే ఒక్క ఆస్పత్రి కూడా కేటగిరీ ‘ఏ’లోకి రాలేదు. ‘బీ’ కేటగిరీలో 6 ఆస్పత్రులుండగా, ‘సీ’ కేటగిరీలో 12, ‘డీ’ కేటగిరీలో 32 ఆస్పత్రులున్నాయి.

అత్యధికంగా డీ కేటగిరీలో ఆస్పత్రులు నమోదు కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది పనితీరు మారాల్సిందే: కలెక్టర్
 ఆస్పత్రుల పనితీరును పరిశీలించిన కలెక్టర్ ఎన్.శ్రీధర్ జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆస్పత్రుల వారీగా పనితీరును ప్రస్తావిస్తూ ఘాటుగా స్పందించారు. ‘తొలిసారిగా సమావేశం నిర్వహిస్తున్నందున కేవలం హెచ్చరికలతో సరి పెడుతున్నాను.

 రెండో సమావేశం నిర్వహించే నాటికి కచ్చితంగా పురోగతి ఉండాలి. లేకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటా.’ అని స్పష్టం చేశారు. పలుచోట్ల డాక్టర్లు విధులకు గైర్హాజరవుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే పనితీ రును మెరుగుపర్చుకోవాలన్నారు. ఇకపై ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ సుభాష్‌చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు