డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

23 May, 2019 03:09 IST|Sakshi

3 దశల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌

23 నుంచి జూన్‌ 3 వరకు రిజిస్ట్రేషన్లు

25 నుంచి జూన్‌ 3 వరకు వెబ్‌ ఆప్షన్లు

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు తెరలేచింది. ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే అడ్మిషన్లకు సంబంధించి దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీస్‌ తెలంగాణ) నోటిఫికేషన్‌ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సంస్థ చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తదితరులు బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని 1,049 డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఎస్‌ డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఈ నెల 23 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. మీ సేవ, ఈ సేవ, ఆధార్‌ ఫోన్‌ లింకైన మొబైల్, హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో https://dost.cgg.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 

ప్రత్యేక హెల్ప్‌లైన్‌ కేంద్రాలు.. 
విద్యార్థుల సందేహాల నివృత్తి, సాంకేతిక సహకారం తదితర అంశాల కోసం దోస్త్‌ కమిటీ 75 హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో.. మరో 7 కేంద్రాలను వర్సిటీల్లో ఏర్పాటు చేసింది. వీటితోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 10 ప్రత్యేక హెల్ప్‌లైన్‌ సెంటర్లను అందుబాటులో ఉంచింది. ఈ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. బయోమెట్రిక్‌ (వేలిముద్రలు) అథెంటికేషన్‌ సమస్య ఉంటే ఇక్కడ ఐరీస్‌ పద్ధతిలో రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంది.  

కాలేజీకి వెల్లకుండానే సీటు కన్ఫర్మేషన్‌ 
ఈసారి సీటు కన్ఫర్మేషన్‌ కోసం కాలేజీకి వెళ్లకుండా ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ను తెచ్చారు. నేరుగా తరగతులు ప్రారంభమయ్యే నాడే కాలేజీలో రిపోర్టు చేయొచ్చు. ఫీజుల చెల్లింపునంతా ఆన్‌లైన్లో చేయాలి. ఎంపిక చేసుకున్న కాలేజీకి ఈ వివరాలను సమర్పి ంచాలి. దరఖాస్తు అప్పుడే విద్యార్థి ద్వితీయ భాష వివరాలుంటాయి.  


కొత్త యాప్‌.. 
ఈసారి కొత్తగా దోస్త్‌ మొబైల్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆండ్రాయిడ్‌ సిస్టం ద్వారా ఇది నడుస్తుంది. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ తర్వాత వచ్చే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా యాప్‌ను వినియోగిచుకోవచ్చు.

ఒత్తిడి చేస్తే చర్యలు: 
కొన్ని కాలేజీలు తమ సంస్థలోనే అడ్మిషన్లు తీసుకునేలా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు గతేడాది పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అలాంటివాటిని ఉపేక్షించం. ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించి ఆ కాలేజీని దోస్త్‌ నుంచి తొలగిస్తాం. ఈసారి 27 కాలేజీలు దోస్త్‌లో లేవు. మరో 20 మైనార్టీ కాలేజీలు సొంతంగా ప్రవేశాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.     
- తుమ్మల పాపిరెడ్డి, టీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్‌

మరిన్ని వార్తలు