ఎన్టీఆర్‌ గొప్ప నటుడు 

29 May, 2019 03:09 IST|Sakshi
సాకియాకు ఎన్టీఆర్‌ పురస్కారం ప్రదానం చేస్తున్న రోశయ్య, లక్ష్మీపార్వతి   

ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో మాజీ గవర్నర్‌ కె.రోశయ్య

అస్సామీ రచయిత డాక్టర్‌ నగేన్‌ సాకియాకు ఎన్టీఆర్‌ జాతీయ సాహితీ పురస్కారం ప్రదానం 

హైదరాబాద్‌ : నందమూరి తారకరామారావు గొప్ప నటుడని తమిళనాడు మాజీ గవర్నర్‌ డాక్టర్‌ కె.రోశయ్య అన్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ అస్సామీ రచయిత, మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌ నగేన్‌ సాకియాకు ఎన్టీఆర్‌ జాతీయ సాహితీ పురస్కారం–2019 ప్రదానం చేశారు. అనంతరం రోశయ్య మాట్లాడుతూ, రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పటికి నటుడిగా ఎన్టీఆర్‌ను ఎంతో అభిమానించానని అన్నారు. ప్రభుత్వ సలహాదారులు డాక్టర్‌ కె.వి.రమణాచారి మాట్లాడుతూ, రాజకీయం విడదీస్తుందని.. సాహిత్యం మాత్రం అందరినీ కలుపుకుపోతుందని అన్నారు. ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ ఎన్‌.లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పేరిట సేవచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా నృత్య గురువు ఇందిరా ముస్నూరి శిష్యబృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి జీవిత రాజశేఖర్, ఆర్‌టీఐ మాజీ కమిషనర్‌ పి.విజయ్‌బాబు, ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ అనంతలక్ష్మి, చింత కిరణ్‌కుమార్, యువ కళావాహిని అధ్యక్షులు వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు