కారెక్కిన ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి

18 Jan, 2019 17:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. గజ్వేల్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో ప్రతాప్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల ఆహ్వానం మేరకు పార్టీలో చేరుతున్నానని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో చేరమని 2009 నుంచి వివిధ సందర్భాల్లో కేటీఆర్‌ తనను కోరారనీ, ఆయన ఆహ్వానంతో ఇప్పుడు పార్టీలోకి వస్తున్నట్లు ఒంటేరు వెల్లడించారు.

కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లోకి వెళ్లాయని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించారని ఒంటేరు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా కేసీఆర్‌ పక్షానే ఉన్నారని, ఇలాంటప్పుడు కేసీఆర్‌పై తాను పోరాటం చేయడంలో అర్థంలేదన్నారు. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా పార్టీ కోసం తీవ్రంగా కష్టపడతానని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్‌కు బలమైన నేతగా ఉన్న ప్రతాప్‌రెడ్డి 2014, 18 అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా సీఎం కేసీఆర్‌పై పోటీచేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు