బాలిక కిడ్నాప్.. నిందితుడి రిమాండ్

27 May, 2015 22:55 IST|Sakshi
బాలిక కిడ్నాప్.. నిందితుడి రిమాండ్

మేడ్చల్(రంగారెడ్డి జిల్లా): బాలికను కిడ్నాప్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కిడ్నాప్‌తో మనస్తాపం చెందిన బాలిక ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మండల పరిధిలోని బాసిరేగడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ శశాంక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొట్టె శ్రీను(20) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక నగరంలోని చింతల్ ఐడీపీఎల్ కాలనీలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది.

శ్రీను సోమవారం సాయంత్రం బాలికకు మాయమాటలు చెప్పి తన ఆటోలో ఎక్కించుకుని ఆమెను నగరంలోని అంబర్‌పేట్‌లోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లాడు. బాలిక కనిపించకపోవడంతో ఆమె కుటుంబీకులు శ్రీనుపై అనుమానం వ్యక్తంచేస్తూ మంగళవారం మేడ్చల్ ఠాణాలో కిడ్నాప్ కేసు పెట్టారు. విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. అనంతరం బాలికను ఆమె కుటుంబీకులకు అప్పగించారు. ఆ పరిణామాలతో మనస్తాపం చెందిన బాలిక బుధవారం ఉదయం బాత్‌రూంలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నగర శివారులోని హర్ష ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు