ఫొటో తీశాడు.. బుక్కయ్యాడు!

12 Apr, 2019 17:41 IST|Sakshi
కేంద్రంలో ఓటరును ఫొటో తీస్తున్న అధికారి

సాక్షి, వీపనగండ్ల: చట్టప్రకారం పోలింగ్‌ కేంద్రంలో ఫొటోలు తీయడం, సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం నేరంకాగా, పోలింగ్‌ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారే ఆ దృశ్యాలను చిత్రీకరించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సంఘటన మండలంలోని బొల్లారం గ్రామం 139వ పోలింగ్‌ కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామంలోని 139పోలింగ్‌ కేంద్రంలో లింగాల డీఆర్‌డీఏ విభాగంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేష్‌నాయక్‌ ఓపీఓగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లను, ఈవీఎం వద్దకు వెళ్లి ఓటు వేస్తున్న దృశ్యాలను తన కెమెరాతో చిత్రీకరించారని ఈ విషయమై ఆ గ్రామానికి చెందిన ఓటర్లు ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో తహసీల్దార్‌ ఫొటోలు చిత్రీకరించిన అధికారిపై విచారణ చేపట్టారు. తనకు వీడియోకాల్‌ వస్తే మాట్లాడాను తప్పా ఫొటోలు తీయలేదని సదరు ఓపీఓ సమాధానం ఇచ్చినట్లు తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ ఆదేశానుసారం ఫొటోలు చిత్రీకరించిన ఫోన్‌çను స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయి విచారణ చేపట్టి అధికారులు నివేదికలు పంపనున్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు