అధికారికంగా బౌరాపూర్‌ భ్రమరాంబ జాతర

28 Feb, 2019 04:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని చెంచు తెగలు ఏటా నిర్వహించే బౌరాపూర్‌ భ్రమరాంబ జాతరకు ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. ఇకపై ఏటా నిర్వహించే ఈ జాతరకు ప్రభుత్వమే నిధులిచ్చి నిర్వహించనుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖకు స్పష్టం చేసింది. శివరాత్రి సందర్భంగా నాగర్‌కర్నూ ల్‌ జిల్లా లింగాల మండలం బౌరాపూర్‌లో ఈ జాతర నిర్వహిస్తారు. ఈ గ్రామం నల్లమల అటవీ ప్రాం తంలో ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే ప్రధాన రోడ్డు నుం చి 30 కి.మీ. మేర లోనికి నడుచుకుంటూ వెళ్లాలి. క్రూర మృగాలున్న ఈ అడవిలోకి ప్రవేశాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. జాతర నేపథ్యంలో వారం పాటు ప్రవేశానికి ప్రభుత్వం అనుమతినిస్తుంది. జాతరకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక రోడ్లు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో చెంచుల సాంప్రదాయాల ప్రకారం ఉత్సవాలను నిర్వహిస్తారు.   

మరిన్ని వార్తలు