8న ‘స్వచ్ఛ తెలంగాణ’కు శ్రీకారం

6 May, 2015 00:31 IST|Sakshi

రాష్ట్రంలోని 67 పట్టణాల్లో అమలు
హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ నెల 8న ‘స్వచ్ఛ భారత్-స్వచ్ఛ తెలంగాణ’ కార్యక్రమం ప్రారంభించనున్నామని రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు బి.నాగిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 67 మున్సిపాలిటీల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ తెలంగాణ ఏర్పాట్లపై మేయర్లు/చైర్మన్‌లు, మునిసిపల్ కమిషనర్లతో మంగళవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కింద వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణతో పాటు పారిశుధ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.


ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు ప్రతి పట్టణానికి ఒక నోడల్ అధికారిని, ప్రతి వార్డుకు వార్డు స్థాయి అధికారిని నియమించామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేసుకునే లబ్ధిదారులకు ఈ నెల 8న ప్రారంభోత్సవం రోజు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. రెండు విడతల్లో పునాది వరకు నిర్మిస్తే రూ.6 వేలు, పూర్తిగా నిర్మిస్తే మిగిలిన రూ.6 వేలను లబ్ధిదారులకు చెల్లిస్తామన్నారు.

మరిన్ని వార్తలు