ఉసురు తీసిన విద్యుత్‌ షాక్‌

6 Jun, 2020 04:27 IST|Sakshi
విద్యుత్‌ షాక్‌కు గురైన నర్సింహులు, సత్తయ్య

తండ్రి దుర్మరణం

తీవ్ర గాయాలతో కొడుకు బ్రెయిన్‌ డెడ్‌

సిద్దిపేట జిల్లా్లలో ఘటన 

వర్గల్‌ (గజ్వేల్‌): విద్యుత్‌ షాక్‌ ఓ రైతు కుటుంబంలో పెనువిషాదం నింపింది. తండ్రి దుర్మరణం చెందగా, కొడుకు తీవ్ర గాయాలతో బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడు. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం రాంసాగర్‌పల్లిలో శుక్రవారం ఈ విషాదకర ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. వర్గల్‌ మండలం నెంటూరు గ్రామపంచాయతీ పరిధిలోని రాంసాగర్‌పల్లికి చెందిన రైతు కిచ్చుగారి సత్తయ్య(65)కు భార్య లక్ష్మి, వీరికి రెండెకరాల లోపు సాగు భూమి ఉన్నది. శుక్రవారం సత్తయ్య తన పెద్ద కొడుకు నర్సింహులు(35)తో కలసి వ్యవ సాయ బోరు వద్ద సర్వీసు వైరు మార్పిడి చేసేందుకు వెళ్లాడు. స్తంభం నుంచి బోరు బావికి సర్వీసు వైరు మార్పిడి చేసుకుంటున్న విషయాన్ని నర్సింహులు అక్కడి లైన్‌మన్‌ బాలరాజుకు ఫోన్‌ లో వివరించి కరెంటు సరఫరా నిలిపేయాలని కోరాడు.

లైన్‌మెన్‌ సరేననడంతో కరెంటు నిలిపేశారనే ధైర్యంతో బోరుబావి వద్ద విద్యుత్‌ స్తంభం ఎక్కిన నర్సింహులు, సర్వీసు వైరు బిగించే పనిలో నిమగ్నమయ్యాడు. వైరు రెండో కొనను తండ్రి సత్తయ్య పట్టుకుని చూస్తున్నాడు. అంతలోనే విద్యుత్‌ సరఫరా జరగడంతో తండ్రీ కొడుకులు విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. గాయపడిన తండ్రి సత్తయ్య ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. స్తంభంపై నుంచి కిందపడి గాయాలపాలైన కొడుకు నర్సింహులను చికిత్స కోసం గజ్వేల్‌ కు ఆ తరువాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నర్సింహులు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు చెప్పినట్లు గ్రామ స్తులు వివరించారు. లైన్‌ క్లియర్‌ (ఎల్‌సీ) ఇ చ్చిన లైన్‌మన్‌ బాల్‌రాజు నిర్లక్ష్యమే సత్తయ్య ఉసురు తీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు మజీద్‌పల్లి సబ్‌స్టేషన్‌ వద్ద రహదారిపై బైఠాయించారు. దీంతో డిపార్ట్‌మెంట్‌ తరఫున రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని మధ్యవర్తులు నచ్చచెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు