లారీ కిందపడిన బైక్.. ఒకరి మృతి

14 Oct, 2015 20:01 IST|Sakshi

వేగంగా వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించిన ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి లారీ వెనక చక్రాల కింద పడటంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వరంగల్ జిల్లా మామ్నూరులోని టీఎస్‌ఎస్పీ 4వ బెటాలియన్ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. పెరికేడు మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన ఎడ్లపల్లి బోసు(40), వెంకటేశ్వర్‌రావు(50), మరంశెట్టి సత్యనారాయణ(36) వరంగల్ మార్కెట్‌లో పత్తి అమ్మి తమ ద్విచక్రవాహనాలపై వరంగల్-ఖమ్మం రహదారిలో ఇంటికి బయలు దేరారు. టీఎస్ఎస్పీ 4వ బెటాలియన్ సమీపంలో పక్క నుంచి వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించారు.

ఇదే సమయంలో ఎదురుగా మరో వాహనం వస్తుండటంతో అదుపుతప్పి లారీ వెనక చక్రాల కింద పడ్డారు. ఈ ఘటనలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 సాయంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు