వంద శాతం

1 Aug, 2015 03:33 IST|Sakshi

జిల్లాలో ఆధార్ అనుసంధానం పూర్తి
నేడు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ రాక
మధ్యాహ్నం 3 గంటలకు {పగతిభవన్‌లో సమావేశం
 
 ప్రగతినగర్ : ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంలో జిల్లా వంద శాతం నమోదు పూర్తిచేసుకొని దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంలో జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. దీంతో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పక్కా ప్రణాళికతో ఓటరు కార్డును ఆధార్ అనుసంధానానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆయనతో పాటు బీఎల్‌వోలు, ఇతర అధికారులు నిర్విరామంగా శ్రమించి ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రానికి వంద శాతం అనుసంధానంతో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు.

ఆధార్ అనుసంధానానికి కలెక్టర్ ప్రత్యేక కౌంటర్లు, మొబైల్ వ్యాన్‌లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. గ్రామీణ ప్రజలకు సైతం అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 14,04,306 మంది ఓటర్లు ఉండగా మొబైల్ ఫోన్ ద్వారా 361 మంది ఓటర్లు, స్వంతంగా 1957 మంది, కాల్ సెంటర్‌లకు ఫోన్‌చేసి 76 మంది, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా 6392 మంది ఓటర్‌కార్డును ఆధార్‌కు అనుసంధానం చేయించుకున్నారు. మిగిలినవి బూత్ లెవల్ ఆఫీసర్లు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు, గ్రామ కార్యదర్శులు ఇంటింటికీ తిరిగి ఓటర్ కార్డు ఐహెచ్‌ఎల్ నంబర్ సేకరించి ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయించారు.

  నేడు జిల్లాకు ఎన్నికల అధికారి రాక..
 రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ శనివారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డుకు 100 శాతం ఆధార్ అనుసంధానంతో జిల్లా దేశంలోనే ముందున్న నేపథ్యంలో కలెక్టర్, నియోజక వర్గ స్థాయి తహశీల్దార్లతో సమావేశం నిర్వహించేందుకు భన్వర్‌లాల్ వస్తున్నారని, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక ప్రగతిభవన్‌లో సమావేశం ఉంటుందని తెలిపారు. సమావేశం అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి బాసరకు వెళుతారని కలెక్టర్ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు