మంత్రాల నెపంతో కొట్టి చంపారు...

26 Mar, 2015 07:41 IST|Sakshi

మెదక్: మూఢ నమ్మకాలు ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో మంత్రాల నెపంతో ఓ కుటుంబానికి చెందిన వారిని గ్రామస్తులు విచక్షణ రహితంగా కొట్టటంతో ఒకరు మృతి చెందారు. గ్రామానికి చెందిన రొడ్డ రామస్వామి(62) మంత్రాలు వస్తాయని కొందరు గ్రామస్తులకు అనుమానం. అతని కారణంగానే తమ కుటుంబాల్లో కీడు కలుగుతోందని కొన్ని రోజులుగా వారు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం అర్ధరాత్రి రామస్వామి ఇంటి వద్దకు వెళ్లి, అతనిని పనుందంటూ బయటకు పిలిచారు. కుటుంబసభ్యుల ఎదుటే రాళ్లు, కర్రలతో విచక్షణ రహితంగా కొట్టటంతో రామస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డువచ్చిన అతని భార్య పోచమ్మ(55), కూతురు రేణుక(22) కుమారుడు సాయి(21)లపైనా దాడి చేయటంతో వారు గాయాలపాలయ్యారు. గ్రామస్తుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108లో గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

(తూప్రాన్)
 

మరిన్ని వార్తలు