-
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో బుధవారం మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కరీంనగర్కు మత ప్రచారం కోసం వచ్చిన ఇండోనేషియన్లను రామగుండం నుంచి ఆటోలో తీసుకువచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. దీంతో ఇండోనేషియన్లు కాకుండా జిల్లాలో కరోనా సోకినవారి సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటివరకు జిల్లాలో ఇండోనేషియన్లకు సహాయకుడిగా ఉన్న వ్యక్తి, అతని తల్లి, సోదరిలకు కరోనా పాజిటివ్ తేలిన సంగతి తెలిసిందే.
కాగా, ఢిల్లీ నుంచి రైలులో రామగుండం వచ్చిన 10 మంది ఇండోనేషియన్లు.. అక్కడి నుంచి ఆటోలో కరీంనగర్ చేరుకున్నారు. కరీంనగర్లో పలు ప్రాంతాల్లో సంచరించారు. అయితే వారికి కరోనా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి కరోనా పాజటివ్ తేలడంతో ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.