600 మందికి ఒక పోలింగ్‌ స్టేషన్‌ 

23 Mar, 2019 03:18 IST|Sakshi

జిల్లా కలెక్టర్లకు ఎస్‌ఈసీ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: మండల, జిల్లాపరిషత్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఆదేశించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నందున ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌లో గరిష్టంగా 600 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది.27న గ్రామపంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా ప్రచురించి, 30న అన్ని జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్‌ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు.

ఆ జాబితా ఆధారంగా వచ్చే నెల 7న పోలింగ్‌ స్టేషన్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ ఆదేశించారు. ఈ పోలింగ్‌ స్టేషన్ల ప్రక్రియ వచ్చే నెల 20లోగా పూర్తిచేసుకోవాలని సూచించారు. జిల్లా సీఈవోలు, జిల్లా సహాయ ఎన్నికల అధికారులు, ఎంపీడీవోలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఒక షెడ్యూల్‌ను ఇచ్చారు. మండలాల్లో పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భవనాలను ఎంపీడీవోలు, ఇతర అధికారులు  పరిశీలించి, అక్కడున్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అన్నది అంచనా వేయాలని ఎస్‌ఈసీ సూచించింది.

మరిన్ని వార్తలు