టెన్త్ నుంచి పీహెచ్‌డీ వరకు.. ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు

1 Oct, 2014 02:08 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: పదో తరగతి నుంచి పీహెచ్‌డీ) వరకు సర్టిఫికెట్లను ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇటీవల ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు చాలామంది అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లతో వచ్చినట్లు బయటపడింది. దీంతో వీటి నిరోధానికి చర్యలు చేపట్టాలని వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీలు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన పోలీసు విచారణకు ఆదేశించారు. మరోవైపు టీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వివిధ వర్సిటీల వీసీలతో మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం సమీక్షించారు. నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ వెబ్‌సైట్‌తోపాటు తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్లను ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 7, 8 తేదీల్లో మరోసారి అధికారులు, వీసీలు, ఐటీ కంపెనీల ప్రతినిధులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.
 
 తెలంగాణకు వేరుగా ఇంటర్ పరీక్షలు
 
 కాగా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను ఏపీతో సంబంధం లేకుండా వేరుగా ప్రశ్నపత్రాలు ఇచ్చి నిర్వహిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు