రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు 

28 Apr, 2020 02:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు కళాశాల విద్యాశాఖ పేర్కొంది. ఇంట్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేని విద్యార్థులకు వీడియో పాఠాలను రూపొందించి వాట్సాప్‌ ద్వారా పంపిస్తున్నట్లు వెల్లడించింది. ఆన్‌లైన్‌ డిగ్రీ పాఠాలపై అకడమిక్‌ గైడెన్స్‌ ఆఫీసర్‌ బాల భాస్కర్, జాయింట్‌ డైరెక్టర్‌ యాదగిరి, అకడమిక్‌ ఆఫీసర్‌ జె. నీరజ తదితరులతో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామ్‌చంద్రన్, కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ సమీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్‌ బోధన పక్కాగా చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 125 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 1,270 మంది రెగ్యులర్, 845 మంది కాంట్రాక్ట్, 530 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీ ఒక్కొక్కరు ప్రతిరోజూ 3 చొప్పున ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు