నాలాలో కొట్టుకుపోయిన మహిళ

13 Nov, 2014 00:31 IST|Sakshi
నాలాలో కొట్టుకుపోయిన మహిళ

శామీర్‌పేట్ : బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న క్రమంలో శామీర్‌పేట మండలంలోని అలియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఉప్పల్ బస్టాండ్ వద్ద గల నాలాలో పడి కొట్టుకుపోయింది. ఈ ఘటన  బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ఈపూర్ మండల కేంద్రానికి చెందిన భాగ్యరావు అలియాస్ భాస్కర్, లక్ష్మిలు దంపతులు. వీరు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువుకోసం అలియాబాద్ గ్రామానికి వచ్చి ఉంటున్నారు. భాస్కర్ మేస్త్రీ పని చేస్తుంటాడు. వీరికి కూతురు సత్యవాణి(25)కు ఏడేళ్ల క్రితం నాగార్జునసాగర్‌కు చెందిన ప్రేమ్‌రాజ్‌తో వివాహమైంది. ప్రేమ్‌రాజ్ స్థానికంగా ఉన్న సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

బుధవారం సత్యవాణి తన కుటుంబీకులతో కలిసి సికింద్రాబాద్‌లో ఉంటున్న బంధువుల  ఇంటికి వెళ్లింది. తిరిగి రాత్రి అలియాబాద్‌కు వచ్చే క్రమంలో ఉప్పల్ బస్టాండ్ వద్దకు రాగానే అప్పటికే కురుస్తున్న భారీ వర్షం కారణంగా వచ్చిన నీటి ఉధృతికి బస్టాండ్ వద్ద నాలాలో చిక్కుకుపోయింది. స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళను సత్యవాణిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు