‘ఓపెన్’ పరీక్షార్థుల లబోదిబో

7 May, 2015 03:02 IST|Sakshi

సత్తుపల్లి: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టుగా పత్రికల్లో వరుస కథనాలు రావటంతో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పరీక్ష పాస్ చేయించేందుకు దళారులకు డబ్బులు ఇచ్చిన విద్యార్థులు.. ఇప్పుడు తమ పరిస్థితేమిటంటూ లబోదిబోమంటున్నారు. పాస్ గ్యారెంటీ పేరుతో వేయి నుంచి మూడువేల రూపాయల వరకు వసూలు చేసిన దళారులకు ఏం చెప్పాలో తెలీడం లేదు.
 
అదిగో.. ఇదిగో
పరీక్షల నిర్వహణలో సిట్టింగ్, ఫ్లైయింగ్ స్క్వాడ్ కళ్లుగప్పి, పరీక్షార్థులకు కాపీలు అందించేందుకు ఏజెంట్లు కొత్త దారులు వెతుకుతున్నట్టు తెలిసింది. సత్తుపల్లిలోని మూడు సెంటర్లతోపాటు ఖమ్మం నయాబజార్ జూనియర్ కళాశాల, ఖమ్మం ప్రభుత్వ పాఠశాల, కారేపల్లి, భద్రాచలం, పాల్వంచ కేంద్రాలలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టుగా వచ్చిన కథనాలతో వీటిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఫలానా కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరుగుతోందంటూ స్క్వాడ్ అధికారులకు అపరిచితుల మాదిరిగా ఏజెంట్లే సెల్ మెసేజ్‌లు పంపిస్తున్నట్టు తెలిసింది. ఇది నిజమేననుకుని స్క్వాడ్ అటువైపు వెళ్లగానే.. ఈ ఏజెంట్లు ఇటువైపు మరో కేంద్రంలో తమ వారికి కాపీలు అందిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నారుు.
 
డబ్బులు ఇచ్చేయండి

‘మిమ్మల్ని నమ్మి వేల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు మమ్మల్ని కనీసంగా కూడా పట్టించుకోవటం లేదు. మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి’ అని, దళారులను పరీక్షార్థులు ఒత్తిడి చేస్తున్నారు. చివరి నిమిషంలోనైనా చిట్టీలు అందించి ‘న్యాయం’ చేస్తామంటూ వారిని బుజ్జగించేందుకు నిర్వాహకులు (దళారులు) ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు