‘ఆపరేషన్‌ స్మైల్‌’ ఐదో దఫా ప్రారంభం

8 Jan, 2019 05:12 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌ సింగ్, స్వాతి లక్రా, సుమతి

ఇప్పటివరకు 22 వేల మందిని రెస్క్యూ చేసిన సీఐడీ

ఈసారి ‘దర్పన్‌’ ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ ద్వారా గుర్తింపు

మొత్తంగా 174 మంది అధికారులతో ప్రత్యేక బృందం  

సాక్షి, హైదరాబాద్‌: తప్పిపోయిన చిన్నారులు, బాల కార్మిక వ్యవస్థలో నిర్బంధంగా పనిచేస్తున్న మైనర్లు, వ్యభిచార కూపాల్లో బాల్యాన్ని బంధీగా చేయబడ్డ బాలికలను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్‌ స్మైల్‌ ఐదో దఫా కార్యక్రమం సోమవారం ప్రారంభమైం ది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌ సింగ్, మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా, ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఎస్పీ సుమతి, మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మి ప్రారంభించారు.

22 వేల మంది రెస్క్యూ..
గత 4 దఫాల ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 22 వేల మంది చిన్నారులను పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థలు రెస్క్యూ చేశాయి. వీరిలో 60% మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, మిగతా వారి ని స్టేట్‌ హోమ్స్‌కు తరలించి విద్య, వసతి కల్పిస్తున్నారు. ఈసారీ అదే రీతిలో పారిశ్రామిక వాడల్లో బాల కార్మికులుగా ఉన్న వారిని గుర్తించడం, బెగ్గింగ్‌ మాఫియా కింద భిక్షాటనలో నలిగిపోతున్న చిన్నారులను రెస్క్యూ చేయడం, వ్యభిచారంలో మగ్గుతున్న మైనర్లను బయటపడేసేందుకు కృషి చేయనున్నట్టు ఐజీ స్వాతి లక్రా తెలిపారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 174 మంది అధికారులను ప్రత్యేకంగా ఆపరేషన్‌ స్మైల్‌ కోసం రంగంలోకి దించుతున్నామని చెప్పారు. వీరందరికి సోమవారం అవగాహన, రెస్క్యూ ఆపరేషన్‌ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించినట్టు తెలిపారు.

ఫేసియల్‌ రికగ్నైజేషన్‌..
రెస్క్యూ సందర్భంగా గుర్తించిన చిన్నారులు, మైనర్లు వారి వారి వివరాలు చెప్పేందుకు భయపడటం లేదా తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు ఇబ్బంది పడతారని, ఇలాంటి సందర్భంలో రాష్ట్ర పోలీస్‌ శాఖ రూపొం దించిన ‘దర్పన్‌’ ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవాలని శిక్షణలో అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా అదృశ్యమైన వారి వివరాల డేటా బేస్‌ అందుబాటులో ఉంటుం దని, చిన్నారుల ఫొటోలను సరిపోల్చి అడ్రస్, ఇతర వివరాలు గుర్తించనున్నట్లు చెప్పారు. దీని వల్ల ఆయా ప్రాంతాల్లోని పోలీసులను అలర్ట్‌ చేసి తల్లిదం డ్రులకు పిల్లలను అందజేయడం సులభంగా ఉం టుందని శిక్షణలో ఉన్నతాధికారులు సూచించారు. నెల రోజులపాటు ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం కొనసాగుతుందని, ఎలాంటి సమాచారం ఉన్నా పోలీస్‌ శాఖకు తెలిపేందుకు ప్రజలు ముందుకు రావాలని సీఐడీ ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు