శవాల తరలింపునకు దారేదీ..!

20 Nov, 2018 10:51 IST|Sakshi
ఉస్మానియా ఆస్పత్రిలో..

గాంధీ, ఉస్మానియాలో సగానికిపైగా పని చేయని ‘హెర్సే’ వాహనాలు

విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయిస్తున్న బాధితులు  

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదల మృతదేహాల తరలింపు ప్రక్రియ  ప్రహనంగా మారింది. నిర్వహణ లోపం వల్ల వాహనాలు తరచుగా మెరాయిస్తుండటం, వివిధ సాంకేతిక లోపాలతో షెడ్డుకు చేరిన వాహనాలకు సకాలంలో రిపేర్లు చేయించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో బాధితులు ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయిస్తున్నారు. మృతదేహాన్ని ఎలాగైనా సొంతూరికి తీసుకెళ్లాలనే బంధువుల ఆతృతను ప్రైవేటు అంబులెన్స్‌ యజమానులు ఆసరాగా చేసుకొని నిలువు దోపిడికి పాల్పడుతున్నారు.

32 వాహనాల్లో సగం షెడ్డులోనే..
రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి చనిపోయిన వారి శవాలు, వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన వారి మృతదేహాలు, వివిధ పనులపై నగరానికి వచ్చి ఆకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయిన వారు, అనాధ శవాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా, గాంధీ శవాగారాలకు తరలిస్తుంటారు. వీటితో పాటు వివిధ జబ్బులతో బాధపడుతూ ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని బతికించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేక చనిపోయిన బాధితు లు ఉంటారు. ఇలా ఉస్మానియా మార్చురీకి రోజుకు సగటున 18 మృతదేహాలు వస్తుండగా, గాంధీ మార్చురీకి రోజుకు సగటున 25 మృతదేహాలు వస్తుంటా యి. శవపంచనామా తర్వాత ఫోరెన్సిక్‌ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం చేసి, బంధువులకు అప్పగిస్తుంటారు.

పేదల మృతదేహాల తరలింపు కోసం ప్ర భుత్వం 2016 నవంబర్‌లో 50 ‘హెర్సే’(పరమపద వాహనాలు)అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఉస్మానియా, గాంధీ, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి, నిలోఫర్, నిమ్స్‌ ఆస్పత్రులకు 32 వాహనాలను కేటాయించింది. నిధుల కేటాయింపు లేమితో పాటు నిర్వహణ లోపం వల్ల వీటిలో ప్రస్తుతం పదిహేను వాహనాలు పని చేయడం లేదు. ఎప్పటికప్పుడు వీటికి రిపేర్లు నిర్వహించి బాధితులకు అందుబాటులో ఉంచాల్సిన యంత్రాంగం పట్టించుకో కపోవడంతో విధిలేని పరిస్థితు ల్లో సొంతూళ్లకు మృత దేహాలను తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తుంది. నిజానికి హెర్సే వాహనాలు అందుబాటులోకి వచ్చిన త ర్వాత ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రైవేటు అంబులెన్స్‌ను నిషేదించారు. కానీ ప్రస్తుతం వీటిలో చాలా వరకు రిపేర్ల పేరుతో షెడ్డులో చేరడంతో ప్రైవేటు వాహనాలు బారులు తీరుతున్నాయి.

విధులకు దూరంగా ఆర్‌ఎంఓలు..
ఒక వైపు సగానికిపైగా వాహనాలు షెడ్డు దాటని పరిస్థితులో ఉంటే..మరో వైపు అందుబాటులో ఉన్నవాటికి విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. ఆస్పత్రిలో ఎవ రైనా బాధితుడు చనిపోతే..మృతదేహం తరలింపు కోసం పరమపద వాహనాలను సమకూర్చాల్సిన బాధ్యతను సంబంధిత ఆస్పత్రి ఆర్‌ఎంఓలకు అప్పగిం చింది. కానీ ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో ఆర్‌ఎంఓలు కాకుండా హెల్త్‌ ఇన్స్‌పెక్టర్లకు అప్పగించడం వివాదాస్పదంగా మారింది. కీలకమైన ఎంఎల్‌సీ కేసుల వివరాలు నమోదు సహా పరమపద వాహనాల బుకింగ్‌ హెల్త్‌ ఇన్స్‌పెక్టర్లు అప్పగించడం వివాదాస్పదంగా మారింది. సమయానికి వీరు ఆస్పత్రిలో అందుబా టులో లేక పోవడంతో బంధువులకు ఇబ్బందులు తప్పడం లేదు. గంటల తరబడి ఎదురు చూసినా వీరు రాకపోవడం, ఒక వేళ వచ్చి వాహనం సమకూర్చి నా..డిజిల్‌ ఖర్చుల పేరుతో సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు