‘విడిచిపెట్టే వరకు ఆందోళనలు’ 

24 Jan, 2020 02:44 IST|Sakshi
మాట్లాడుతున్న చాడ

కాశిం అరెస్టుపై నేడు ఓయూ బంద్‌ 

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ అధ్యాపకుడు డా.కాశింను విడిచిపెట్టే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థి నాయకులు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు. గురువారం ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాశీం విడుదల కోసం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ ప్రధాన కార్యదర్శి రవినాయక్‌ అధ్యక్షత వహించారు.

సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొ.లక్ష్మణ్, డా.అన్సారీ, ఎంఎల్‌ పార్టీ నేత గోవర్ధన్, రమా, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, విమలక్క, ఎమ్మార్పీఎస్‌ నేత మేడిపాపయ్య, ఓయూ అధ్యాపకుడు డా.గాలి వినోద్‌కుమార్‌ పాల్గొని ప్రసంగించారు. కాశింపై కొత్త కేసులను బనాయించి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆయనపై ఉపా కేసు పెట్టి జైల్‌కు తరలించడం అన్యాయమని మండిపడ్డారు. కాశింపై పోలీసులు చేసిన ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డా.గాలి వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఓయూ బంద్‌ చేయనున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు