కాంగ్రెస్‌లో దక్కని చోటు.. బీజేపీ నుంచి పోటీ?

13 Nov, 2018 12:05 IST|Sakshi

కాంగ్రెస్‌కు రాజీనామా యోచనలో ఓయూ నేత మానవతారాయ్‌

సాక్షి, హైదరాబాద్‌ : అసంతృప్తుల నిరసనలు కాంగ్రెస్‌ పార్టీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలలో తన పేరు లేకపోవడంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత మానవతారాయ్‌ తీవ్ర అసంతృత్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని విద్యార్థులందరికీ వివరిస్తానని.. మహాకూటమికి వ్యతిరేకంగా విద్యార్థి లోకాన్ని ఏకం చేస్తానని ఆయన ప్రకటించారు.  కాగా తెలంగాణ  ఉద్యమంలో పాల్గొన్న ఓయూ విద్యార్థులకు సీట్ల కేటాయింపుల్లో మహాకూటమి తీవ్ర అన్యాయం చేసిందని ఓయూ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మానవతారయ్‌ ఖమ్మం జిల్లా సత్తుపల్లి స్థానాన్ని ఆశించిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా ఆసీటు టీడీపీకి కేటాయించడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మరోసారి పోటీలో నిలిచారు. మరోవైపు మానవతారాయ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై తన అనుచరులతో చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు. బీజేపీ నుంచి కంటోన్మెంట్‌ స్థానంలో బరిలో నిలిచే అవకాశం ఉందని సమాచారం.
 

మరిన్ని వార్తలు