ఓయూ ప్రొఫెసర్‌కు రిమాండ్‌

12 Oct, 2019 02:53 IST|Sakshi
జగన్‌

గద్వాలటౌన్‌/గద్వాల క్రైం: మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ, పార్టీ కేడర్‌ నియామకాలు చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఉస్మానియా వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జగన్‌ను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం గద్వాల కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు 14 రోజుల రిమాండ్‌ను విధిస్తూ మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. జగన్‌ను మహబూబ్‌నగర్‌ జైలుకు తరలించారు. ఈ నెల 5న గద్వాల మండలం మేళ్లచెర్వులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ విద్యార్థి వేదిక నేత నాగరాజును కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు పంపారు. స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో పోలీసులు అందించిన సమాచారం మేరకు మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌కు సహకరిస్తున్నారన్న అభియోగంతో 8 మందిపై కేసులు నమోదు చేశారు. నాగరాజును ఏ1గా, జగన్‌ను నాలుగో నిందితుడిగా నమోదు చేశారు. కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపిన పోలీసులు మిగతా వారి ప్రమేయంపై  దర్యాప్తు చేస్తున్నారు. యురేనియం తవ్వకాలతో జరిగే నష్టాలను సమాజానికి తెలియజేస్తూ వ్యతిరేకించడం వల్లే మావోయిస్టులకు మద్దతు ఇస్తున్నారన్న ముద్ర వేస్తున్నారని తెలుగు అధ్యాపకురాలు, జగన్‌ భార్య రజని ఆరోపించారు.

మరిన్ని వార్తలు