సీటు బెల్టే రక్షణ కవచం
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 64 కిలోమీటర్ల వేగమే మేలు
వేగం పెరిగితే ఎయిర్ బెలూన్స్ కూడా పనిచేయవు
ఎంవీఐ శ్రీనివాసరెడ్డి సూచనలు
నల్లగొండ : ‘మితిమీరిన వేగం ప్రమాదాలకు ప్రధాన కారణం. కారు నడిపే వ్యక్తితో పాటు కారులో ఉన్న అందరూ ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకోవాలి. అదే ప్రాణానికి రక్షణ కవచం లాంటిది’ అంటున్నారు నల్ల గొండ ఎంవీఐ శ్రీనివాస్రెడ్డి. రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు హరికృష్ణ మృతిచెందిన నేపథ్యంలో ఆయన బుధవారం పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. ‘ఇంటర్నేషనల్ సెప్టీ టెస్టింగ్’ సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం ఏ కారైన 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తేనే మంచిది. ఆ సమయంలో ప్రమాదం జరిగినా కారులో రక్షణ కోసం ఉన్న ఎయిర్ బ్యాగ్స్ పనిచేస్తాయి. ప్రమాదం నుంచి బయటపడవచ్చు.
అంతకంటే వేగం మించితే వారు వెళ్లే వేగాన్ని బట్టి ఎంత రక్షణ ఉంటుదనేది చెప్పలేని పరిస్థితి. ప్రధానంగా ప్రమాదం అనేది మానవ తప్పిదంగానే ఎక్కువ శాతం ఉంటుంది. ప్రస్తుతం అత్యంత సాంకేతికతతో కూడిన వాహనాలు తయారవుతున్నాయి. కారును స్టార్ట్ చేయడానికి కీ పెట్టగానే అన్ని లైట్లు వస్తాయి. ఆన్ చేయగానే ఆ లైట్లన్ని పోతాయి. ఒక వేళ లైట్లు కొన్ని వెలుగుతున్నాయంటే అందులో ఏదో ఒక ప్రాబ్లం ఉందని వాహనచోదకుడు తెలుసుకోవాల్సిందే. కానీ చాలా మంది పట్టించుకోకుండా అలానే నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. బెల్ట్ పెట్టుకోకుంటే శబ్ధం వస్తుంది. అది కొంతదూరం వెళ్లే వరకే వస్తుంది.
కానీ చాలా మంది సీటు బెల్టు పెట్టుకోవడం లేదు. ఇంజన్అయిల్ మార్చుకోవాల్సిన సమయం వచ్చినా, టైర్లో గాలి తక్కువగా ఉన్నా సిగ్నల్స్ వస్తాయి. పట్టించుకోవడం లేదు. టైర్ల కంపెనీలు లక్ష కిలోమీటర్ల వరకు మన్నిక ఉంటాయని చెప్పుతున్నాయి. కానీ నడిపే వ్యక్తికి బ్రేక్ వేసిన సందర్భంలో టైర్ జారీపోతున్నట్లుగా ఉంటే దానిని వెంటనే మార్చుకోవాల్సిందే. సెల్ప్ఫోన్ మాట్లాడుతూ కారు నడపడం మంచిది కాదు. చోదకుడు ఎప్పుడూ వాహనం ఎంత వేగంలో ఉందో చూసుకుంటూ, ప్రయాణం మీదనే దృష్టి సారిం చాలి. ఏదైనా అవసరమైతే ఆగాలి. తప్ప కారు నడుపుతూ ఫోన్ మాట్లాడటం, వాటర్ తాగడం లాంటి పనులు చేయడం మంచిది కాదు. ఎన్ని కోట్ల రూపాయల వాహనమైనా నిబంధనల ప్రకారం నడిపితేనే రక్షణ. లేదంటే ప్రమాదాలను కొని తెచ్చుకున్నవాళ్లమే అవుతాము.
సీటు బెల్ట్తో ప్రాణానికి రక్షణ
నల్లగొండ క్రైం : సీటు బెల్ట్తో ప్రాణానికి లింక్ ఉంది. కారులో సీటు బెల్ట్ ధరించి వాహనాన్ని నడిపే వారంతా సురక్షితంగా గమ్యానికి చేరుకుంటున్నారు. ఎంతటి ప్రమాదం జరిగినా సీటు బెల్ట్ ఉంటే ప్రాణాపాయం నుంచి బయటపడతారని నల్లగొండ టూటౌన్ సీఐ భాష తెలిపారు. హరికృష్ణ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని స్పష్టం చేశారు.