ఏకగ్రీవాలపై  గులాబీ నజర్‌

16 Jan, 2019 11:00 IST|Sakshi
ఆమనగల్లులో నామినేషన్‌ పత్రాలు పరిశీలిస్తున్న అధికారులు

తొలిదశలో 18 మంది ఏకగ్రీవ సర్పంచ్‌లు

టీఆర్‌ఎస్‌ బలపరిచిన వారే

.

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  పంచాయతీ ఎన్నికల్లో గులాబీ వికసిస్తోంది. సర్పంచ్‌లుగా ఏకగ్రీవమైన అభ్యర్థులు ఒక్కొక్కరుగా అధికార పార్టీ గూటికి చేరుతున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల విజయోత్సాహంతో స్థానిక సంస్థల్లోనూ తమ ముద్ర వేసేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు రంగంలోకి దిగారు. అధికార పార్టీ హవా కొనసాగేలా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తెరవెనుక పావులు కదుపుతున్నారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 20 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఇందులో 18 మంది అభ్యర్థులు టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన వారే కావడం విశేషం.

వీరిలో కొందరు మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ సానుభూతి పరులు కాగా.. మరికొందరు ఇటీవల పార్టీకి దగ్గరయ్యారు.  వీలైనంత మంది సర్పంచ్‌లు తమ పార్టీ వారు ఉంటే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగించవచ్చని గులాబీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఏకగ్రీవాలపై నేతలు దృష్టి సారించారు. మరోపక్క కాంగ్రెస్‌ నాయకులూ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు 14 జీపీలకు ప్రోత్సాహం..

మొదటి ఎన్నిక జరగాల్సిన 179 జీపీల్లో 14 పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి. సర్పంచ్‌ స్థానంతోపాటు సదరు పల్లెలోని వార్డులన్నీ ఏకగ్రీవమే. ఈ గ్రామ పంచాయతీలన్నీ ప్రభుత్వం అందజేసే ప్రోత్సాహానికి అర్హత సాధించాయి. ఏకగ్రీవమైన జీపీ జనాభా ఐదు వేలలోపు ఉంటే రూ.5 లక్షలు, అంతకుమించితే రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ప్రోత్సాహం అందాలంటే సర్పంచ్‌ స్థానంతోపాటు వార్డులన్నీ ఏకగ్రీవం కావాల్సిందే. మరో ఆరు పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలు మాత్రమే ఏకగ్రీవం కాగా.. పూర్తిస్థాయిలో వార్డులు సభ్యులు కాలేకపోయారు.

దీంతో ఈ జీపీలు ప్రోత్సాహానికి దూరమైనట్లే. ఏకగ్రీవమైన 20 సర్పంచ్‌ స్థానాలు పోను.. మిగిలిన 159 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఈనెల 21న ఎన్నిక జరగనుంది. సర్పంచ్‌ స్థానాలకు 471 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1,580 వార్డులకుగాను.. 236 వార్డుల ఏకగ్రీవమయ్యాయి. మరో వార్డుల్లో స్థానికులు ఎన్నికలను బహిష్కరించారు. ఇవి మినహా 1,341 వార్డులకుగాను 3,292 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 

రెండో దశపైనా దృష్టి..
రెండో దశగా 25న ఎన్నికలు జరిగే 181 పంచాయతీల్లో నామినేషన్ల పరిశీలన సోమవారంతో ముగిసింది. ఇందులో సర్పంచ్‌ స్థానాలకు 947, వార్డులకు 4,988 నామినేషన్లు ఓకే అయ్యాయి. మంగళవారం అప్పీళ్లను అధికారులు స్వీకరించనున్నారు. సర్పంచ్‌ స్థానాలకు 1,232, 1,656 వార్డులకుగాను 5,391 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ 17తో ముగియనుంది. ఈ పంచాయతీలపైనా నేతలు దృష్టిసారించారు. ఏకగ్రీవం చేసేందుకు అధికార, విపక్ష పార్టీల నాయకులు కసరత్తు మొదలుపెట్టారు.  సర్పంచ్‌ అభ్యర్థులకు టచ్‌లోకి వచ్చి బుజ్జగింపులు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు